మంచినీటి రిజర్వాయర్కు గండి
ABN , First Publish Date - 2022-01-15T06:23:17+05:30 IST
మునిసిపల్ 25వ వార్డు పెదఎరుకపాడుకు అతి సమీపంలో ఉన్న 36 ఎకరాల పాత పంపుల చెరువుకు శుక్రవారం గండి పడింది.
గుడివాడ టౌన్, జనవరి 14 : మునిసిపల్ 25వ వార్డు పెదఎరుకపాడుకు అతి సమీపంలో ఉన్న 36 ఎకరాల పాత పంపుల చెరువుకు శుక్రవారం గండి పడింది. 50 ఏళ్ల క్రితం తవ్విన మంచినీటి చెరువుకు గట్లు పటిష్టతపై ఎప్పటికప్పుడు మునిసిపల్ వాటర్ వర్క్స్ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. నిఘా కొరవడంతో గండి పడిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. 36 ఎకరాల చెరువుకు నీటిమట్టం కెపాసిటి 9.75 మీటర్లు కాగా ప్రస్తుతం 9 మీటర్లు మాత్రమే నీటి సామర్త్యం ఉంది. చెరువుకు పడమర వైపు గండి పడడంతో నీటి ఫ్లో అంతా దేవుడి మాన్యం పంట పొలాల్లోకి వెళ్లడంతో అధికారులు చంద్రయ్య కాల్వలోకి మళ్లించారు. ఉత్తరం వైపు గండి పడితే పెదఎరుకపాడు నీటిలో మునిగేదని అడపా వెంకటరమణ(బాబ్జి) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం తప్పినందుకు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కమిషనర్ సంపత్కుమార్ పరిశీలించారు. గండి పూడ్చడానికి చర్యలు చేపట్టారు. కొత్తరిజర్వాయర్ ద్వారా తాగునీటిని అందిస్తామని కమిషనర్ తెలిపారు.
నష్టపరిహారం ఇవ్వాలి
గండితో చెరువు పక్కనే ఉన్న 200 ఎకరాలోని మినుము తదితర పంటలు ముంపునకు గురై రైతులు నష్టపోయారని రైతు సంఘం డివిజన్ కార్యదర్శి నీలం మురళీకృష్ణారెడ్డి, కౌలు రైతు సంఘం నాయకుడు బివి శ్రీనివాసరావు సీపీఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి అన్నారు వారిని పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంపుల చెరువు గట్టు కరకట్ట పటిష్టను పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం కార్యదర్శి ఆర్సిపి.రెడ్డి డిమాండ్ చేశారు.