దేవుడే దిక్కు!?

ABN , First Publish Date - 2021-01-07T07:38:17+05:30 IST

దేశంలోనే అద్భుతమైన టెక్నాలజీ వాడుతూ, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన ఘనత ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ సొంతం..

దేవుడే దిక్కు!?

  • విగ్రహాల ధ్వంసంలో దొరకని దోషులు
  • అసమర్థతకాదు... నిస్సహాయతే కారణమా?
  • అర్ధరాత్రి, మారుమూల 
  • ప్రాంతాలంటూ సర్కారు వింత వాదన
  • నాడు ఎన్నో కేసులను ఛేదించిన ఘనత
  • నేడు చేతులు కట్టేస్తున్న అధికార నేతలు
  • శ్రీశైల మఠంలో తవ్వకాలు జరిపిన
  • కేసులో ఒకరికి వైసీపీ నేత అండ
  • ఆంజనేయుడి విగ్రహం పెకలించిన
  • కేసులో నిందితుడు రెండోరోజే విడుదల
  • తేలని వెండి రథం సింహాల సంగతి
  • అంతర్వేది రథం దగ్ధం సీబీఐకి!
  • రామతీర్థం కేసు దర్యాప్తు సీఐడీకి

‘‘అర్ధరాత్రి, చీకట్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. 

ఇది పొలిటికల్‌ గెరిల్లా యుద్ధం’’... అని ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్నారు!

తప్పుడు పనులను అర్ధరాత్రే చేస్తారు. మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలనే ఎంచుకుంటారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు, ఆలయాల్లో దొంగతనాలు తరచూ జరిగేవే. కానీ... ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఉద్దేశపూర్వకంగా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రాముడి విగ్రహం తలను వేరు చేయడం, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చేతులు విరగ్గొట్టడం వంటి ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కానీ... పోలీసులు మాత్రం కీలకమైన కేసులను ఛేదించలేకపోతున్నారు. సర్కారు వారు చెబుతున్నట్లు అర్ధరాత్రి, మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నందునే... పోలీసులు నిందితులను పట్టుకోలేకపోతున్నారా?  వారి శక్తిసామర్థ్యాలు చాలడం లేదా? లేక...  శక్తి ఉన్నప్పటికీ ఏవైనా కారణాలవల్ల దానిని వినియోగించడం లేదా? 


(అమరావతి - ఆంధ్రజ్యోతి): దేశంలోనే అద్భుతమైన టెక్నాలజీ వాడుతూ, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన ఘనత ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ సొంతం! ఈ విషయాన్ని ఆ శాఖ పెద్దలు పదేపదే ఘనంగా ప్రకటించుకుంటూ ఉంటారు. అంత గొప్ప టెక్నాలజీ, సామర్థ్యం ఉన్న పోలీసులు ఆలయాలపై దాడులు చేసిన వారిని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. ఈ కేసుల విషయంలో ‘కనిపించని నాలుగో సింహం’పై పైకి కనిపించని ఏవో ఒత్తిళ్లు పని చేస్తున్నాయనే సందేహాలు తలెత్తుతున్నాయి. భక్తులు, పూజార్లు, హిందూ సంఘాలు, సాధువులు, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా విగ్రహాల విధ్వంసం ఆగకపోవడానికి... పోలీసుల అసమర్థత కారణం కాదని, ఈ విషయంలో వారు ‘నిస్సహాయులుగా మారడమే’ కారణమనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


వాళ్లు చెప్పినట్లుగానే... 

శ్రీశైలం మఠంలో గుప్తనిధుల కోసం తవ్వకాలకు సంబంధించిన కేసులో పోలీసులు ఒక అన్యమతస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను అధికార పార్టీ నేతలకు బాగా కావాల్సిన వ్యక్తి! ‘‘శివలింగం పెకలించిన ఘటనలో అతను ఉంటే రాజీనామా చేస్తా’’ అని అధికార పార్టీ నేత సవాల్‌ విసిరారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. కేసు నుంచి ఆ వ్యక్తిని తప్పించారు. దీంతో... శివాలయంలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఆ అన్యమత నేత వీడియోను బీజేపీ నేతలు బహిర్గతం చేశారు. అయినా... పోలీసులు గప్‌చుప్‌! పైగా... వీడియో విడుదల చేసిన బీజేపీ నేతనే పోలీసులు బెదిరించినట్లు తెలుస్తోంది. 


రివర్స్‌ కేసులు... 

కర్నూలు జిల్లాలోనే ఇటీవల కోసిగా సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయ గోపురంపైన ఉన్న విగ్రహాల పెచ్చులూడి కిందపడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని కొట్టేశారని, హుండీ కూడా చోరీ చేసే ప్రయత్నం జరిగిందని స్వయంగా పూజారే తెలిపారు. విచిత్రమేమిటంటే... పోలీసులు పూజారిని, ఆలయ ధర్మకర్తతోపాటు ఈ విషయాన్ని వాట్స్‌పలో షేర్‌ చేసిన ‘ఆంధ్రజ్యోతి’తోపాటు ఒక చానల్‌ విలేకరిని అర్ధరాత్రి దాకా నిర్బంధించి, ఆ తర్వాత వాళ్లపై కేసు పెట్టారు. ఒకవేళ విగ్రహాలు వాటంతట అవే దెబ్బతిని ఉంటే అదే విషయం చెప్పాలి. పూజారిపైనా, విలేకరులపైనా కేసు పెట్టడమెందుకని ఆరా తీస్తే... స్థానిక ప్రజా ప్రతినిధి ‘ఆదేశాలే’ దీనికి కారణమని తెలిసింది.


దుర్గమ్మ రథ సింహాలు ఎక్కడ?

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చెందిన వెండి ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమయ్యాయి. దొంగలు అర్ధరాత్రి ఎత్తుకుపోయి ఉండొచ్చుకానీ... జరిగిన ప్రాంతం మాత్రం ఏ మారుమూలనో లేదు. విషయం బయటికి రాగానే.. ‘లాక్‌డౌన్‌కు ముందే, తెలుగుదేశం హయాంలోనే విగ్రహాలు పోయాయ్‌’ అని అధికార పార్టీ నేతలు తేల్చేశారు. ఆ తర్వాత... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వెండి రథానికి సింహాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. రామతీర్థం ఘటనలో ‘తీవ్రంగా స్పందించిన’ ప్రభుత్వం ఆలయ ధర్మకర్త పదవి నుంచి టీడీపీ   సీనియర్‌ నేతను అప్పటికప్పుడు తప్పించేసింది. కానీ, దుర్గమ్మ వెండి రథాల చోరీపై ఇలాంటి చర్యలేవీ తీసుకోలేదు. ఇక పోలీసుల విషయానికొస్తే... గతంలో ఇదే విజయవాడలో కిలోల కొద్ది బంగారం పోయినప్పుడు, 8 రాష్ట్రాల్లోని దొంగలను ఇట్టే పట్టేశారు. ఇప్పుడు దుర్గమ్మ ఆలయ రథ వెండి సింహాల చోరీ కేసులో దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.


నెల్లూరులోనూ అంతే... 

నెల్లూరులో రంగనాథ స్వామి ఆలయం కూడా ఊరికి దూరంగా,  జన సంచారం లేని ప్రాంతంలో లేదు. అక్కడ రథం తగలబడినప్పుడు... ‘ఎవరో పిచ్చోడు చేశాడు’ అని తేల్చేశారు. అసలైన బాధ్యుడిని మాత్రం గుర్తించలేక పోయారు.


అన్నీ చేస్తున్నాం అంటున్నా...

రాష్ట్రంలో ఆలయాలు, ప్రార్థనా స్థలాల రక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా... విధ్వంసాలు మాత్రం ఆగడంలేదు. ‘ఇది ప్రతిపక్షం కుట్ర’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ... పోలీసులు ఇప్పటిదాకా ఒక్కరినీ ఆధారాలతో అరెస్టు చేయలేదు. 


అర్ధరాత్రి జరిగినా పట్టుకున్నారు!

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పెకలించి తీసేశారు. మరుసటి ఉదయం పూజారి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దామోదర్‌ రెడ్డి, నాగరాజు అనే ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినట్లు అర్ధరాత్రి చీకట్లో జరిగిన నేరమే అయినప్పటికీ... పోలీసులు తమ సత్తా చాటారు. అయితే... నిందితుల్లో ఒకరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. సాదాసీదా కేసు పెట్టడంతో అతను ఇలా జైలుకు వెళ్లి అలా బెయిలుపై వచ్చేశాడు. నెలలు గడుస్తున్నా విగ్రహ పునః ప్రతిష్ట మాత్రం ఇప్పటికీ జరగలేదు. 


పట్టపగలు కదా... పట్టుకున్నారు!

అంతర్వేది నృసింహ స్వామి ఆలయ రథం తగలబడిన ఘటన సంచలనం సృష్టించింది. బహుశా... ప్రభుత్వ పెద్దల వాదన ప్రకారం, అర్ధరాత్రి జరిగిన ఘటన కావడంతో పోలీసులు అసలు కారణమేమిటో కనుక్కోలేకపోయారు. రథం దగ్ధంపై భారీ ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఒక చర్చికి చెందిన కిటికీల అద్దాలు పగిలాయి. ఇది పగటిపూట జరగడంతో నిందితులను చకచకా గుర్తించారు. 40మందిని అరెస్టు ఏడెనిమిది సెక్షన్ల కింద కేసు పెట్టి రిమాండుకు పంపించారు. 14రోజుల తర్వాతే వీరికి బెయిలు వచ్చింది. అంతర్వేది ఆలయ రథం సంగతేంటని ప్రశ్నిస్తే నెపం తేనెటీగలపైకి నెట్టి, ఆ తర్వాత కేసు దర్యాప్తు కేంద్ర సంస్థకు అప్పగించి ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2021-01-07T07:38:17+05:30 IST