బంగారం దిగుమతులు, ఆభరణాల ఎగుమతులు... రెండూ పెరిగాయ్
ABN , First Publish Date - 2021-07-26T21:25:01+05:30 IST
బంగారం దిగుమతులు ఒకవైపు పెరుగుతుండగా, మరోవైపు ఆభరణాల ఎగుమతులు పెరుగుతూండడం విశేషం.
ముంబై : బంగారం దిగుమతులు ఒకవైపు పెరుగుతుండగా, మరోవైపు ఆభరణాల ఎగుమతులు పెరుగుతూండడం విశేషం. మొత్తంమీద పరిస్థితి ఆసక్తికరంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు పదింతలు పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో దేశవ్యాప్తంగా అమలైన లాక్డౌన్ నేపధ్యంలో 688 మిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు... 2021 లో అదే త్రైమాసికంలో 7.9 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. భారత కరెన్సీలో గతేడాది జూన్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు రూ. 5,208.41 కోట్లు కాగా, ఈ ఏడాది రూ. 58,572.99 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఇక వెండి దిగుమతులు 93.7 శాతం తగ్గి, 39.4 మిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితం కావడం విశేషం. గతేడాది లాక్డౌన్ ఉండటంతో దిగుమతులు భారీగా పతనమయ్యాయి. ఆ క్రమంలోనే... ఏడాది ప్రాతిపదికన చూస్తే... దిగుమతులు భారీగా పెరిగినట్లు విశదమవుతోంది.
పది రెట్లు పెరిగిన బంగారం దిగుమతులు...
బంగారం దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు 31 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రతీ సంవత్సరం భారత్ 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూంటుంది. అదే సమయంలో బంగారం, వజ్రాభరణాల ఎగుమతులు 9.1 బిలియన్ డాలర్లకు పెరిగడం గమనార్హం. కాగా... ముందటేడు ఇదే కాలంలో ఈ ఎగుమతులు 2.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.