పసిడి పెట్టుబడులపై పన్ను పోటెంత
ABN , First Publish Date - 2020-06-07T06:07:16+05:30 IST
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో పసిడికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బంగారాన్ని సాక్షాత్తూ లక్ష్మీదేవీ ప్రతిరూపంగా భావిస్తారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో పసిడికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బంగారాన్ని సాక్షాత్తూ లక్ష్మీదేవీ ప్రతిరూపంగా భావిస్తారు. అదే సమయంలో బంగారం పెద్దగా నష్టాలు లేని నమ్మకమైన పెట్టుబడి కూడా. ఇప్పుడు అనేక రూపాల్లో బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చు. మరి ఈ పెట్టుబడులపై పన్ను పోటు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఆదాయ పన్ను (ఐటీ) శాఖ దృష్టిలో బంగారం మూలధన ఆస్తి. నేరుగా బంగారం కొనడం ద్వారా లేదా గోల్డ్ ఈటీఎఫ్లు, సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ), గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ (గోల్డ్ ఎంఎ్ఫలు) ద్వారా పసిడిలో మదుపు చేయవచ్చు. ఈ పెట్టుబడి ఎంత కాలం ఉంచుకున్నారనే విషయం ఆధారంగా, వీటి అమ్మకాలపై వచ్చే లాభాలు పన్ను పరిధిలోకి వస్తాయి.
ఫిజికల్ గోల్డ్
నేరుగా బంగారం కొని మూడేళ్ల తర్వాత అమ్ముకుంటే వచ్చే లాభాల్ని దీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్టీసీజీ)గా పరిగణిస్తారు. దానిపై 20 శాతం పన్ను విధిస్తారు. సర్చార్జీ, ఎడ్యుకేషన్ సెస్ దీనికి అదనం. దీనికి ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. అదే మూడేళ్ల కంటే తక్కువ కాలం ఉంచుకుని అమ్మితే వచ్చే లాభాల్ని స్వల్పకాలిక లాభాలు (ఎస్టీసీజీ)గా పరిగణించి, ఆయా వ్యక్తుల ఆదాయ శ్లాబు ప్రకారం పన్ను విధిస్తారు.
పేపర్ గోల్డ్
గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ ఎంఎఫ్లు, ఎస్జీబీలను పేపర్ గోల్డ్ పెట్టుబడులుగా పరిగణిస్తారు. ఇందులో గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ ఎంఎఫ్ పెట్టుబడులపై వచ్చే లాభాలపై... ఫిజికల్ గోల్డ్ అమ్మకాలపై వచ్చే లాభాల తరహాలోనే పన్ను విధిస్తారు.
ఎస్జీబీల వడ్డీ ఆదాయంపై
ఎస్జీబీ (సావరిన్ గోల్డ్ బాండ్స్) పెట్టుబడి కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఈ పెట్టుబడులపై 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ఆదాయాన్ని ‘ఇతర ఆదాయం’గా పరిగణించి పన్ను విధిస్తారు.
ఐదేళ్ల తర్వాత అమ్మితే
అవసరమనుకుంటే ఎస్జీబీలను ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. అప్పుడు వచ్చే లాభాలపై 20 శాతం ఎల్టీసీజీ చెల్లించాలి. సర్చార్జీ, ఎడ్యుకేషన్ సెస్ దీనికి అదనం. ఈ అమ్మకంపై ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా లభిస్తుంది.
మెచ్యూరిటీ తర్వాత అమ్మితే
ఎస్జీబీలను పూర్తి కాలమైన ఎనిమిదేళ్ల వరకు ఉంచుకుని అమ్మితే వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను పోటు ఉండదు. అయితే ఈ బాండ్లను ఫిజికల్ గోల్డ్, ఈటీఎఫ్ లేదా గోల్డ్ ఎంఎఫ్ల తరహాలో మధ్యలో ఎవరికైనా బదిలీ చేస్తే మాత్రం మూలధన లాభాల పన్ను చెల్లించాలి.
రేపటి నుంచి పసిడి బాండ్ల జారీ
గ్రాము ధర రూ.4,677
ప్రభుత్వ పసిడి బాండ్ల పథకం మరోసారి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) మూడో విడత బాండ్ల జారీ ప్రక్రియ వచ్చే వారంలో ప్రారంభం కానుంది. ఈ నెల 8 నుంచి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి గ్రాము (యూనిట్) ధరను రూ.4,677గా ఆర్బీఐ నిర్ణయుంచింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ వీటిని జారీ చేస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు డిజిటల్ చెల్లింపులు జరిపేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అంటే, వీరికి గ్రాము రూ.4,627కే లభించనుంది. గోల్డ్ బాండ్లను యూనిట్ల రూపంలో జారీ చేస్తారు. యూనిట్ గ్రాముతో సమానం. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. అవసరమైతే ఐదేళ్ల తర్వాత వడ్డీ చెల్లించే తేదీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే వీలుంటుంది.