ఆన్లైన్లో బంగారం విక్రయాలు
ABN , First Publish Date - 2021-05-14T17:00:19+05:30 IST
సంపూర్ణ లాక్డౌన్ నేపథ్యంలో శుక్రవారం జరుపుకోనున్న ‘అక్షయ తృతీయ’ను పురస్కరించుకొని జ్యువెలరీ సంస్థలు ‘ఆన్లైన్’ ద్వారా బంగారు నగల విక్రయాలు...
నేడు ‘అక్షయ తృతీయ’
చెన్నై/పెరంబూర్: సంపూర్ణ లాక్డౌన్ నేపథ్యంలో శుక్రవారం జరుపుకోనున్న ‘అక్షయ తృతీయ’ను పురస్కరించుకొని జ్యువెలరీ సంస్థలు ‘ఆన్లైన్’ ద్వారా బంగారు నగల విక్రయాలు చేపట్టాయి. రాష్ట్రంలో దీపావళి, అక్షయ తృతీయ తదితర శుభదినాల్లో బంగారు కొనుగోలు చేస్తే, అష్టఐశ్యర్యాలు లభిస్తాయని ప్రజల నమ్మకం. ఆ రోజున మొత్తం నగదు వెచ్చించి బంగారం కొనలేని వారు. ప్రతి నెలా కొంత నగదు చెల్లించి, అక్షయ తృతీయ రోజున జమచేసిన నగదుతో కొంత నగదు వేసి బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో, కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో విధించిన లాక్డౌన్ కారణంగా జ్యువెలరీ దుకాణాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో, ప్రజల సౌకర్యార్థం ‘ఆన్లైన్’లో బంగారం విక్రయాలు చేపట్టారు. ఈ విషయమై చెన్నై బంగారు, వజ్రాల నగల వ్యాపారుల సంఘ అధ్యక్షుడు జయంతిలాల్ సలాని మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ కారణంగా గత 2020 అక్షయ తృతీయ రోజున బంగారు దుకాణాలు మూతపడడంతో, అప్పట్లో ‘ఆన్లైన్’ విక్రయాలు ప్రారంభించామన్నారు. ఈ ఏడాది కూడా లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ విక్రయాలు చేపట్టనున్నామన్నారు. వినియోగదారులు సంబంధిత దుకాణాల వెబ్సైట్కు వెళ్లి, నగలను ఎంచుకొని, ఆ రోజు ఉన్న ధరను బట్టి కొనుగోలు చేసి, నగదును ఆన్లైన్ ద్వారా చెల్లించాలన్నారు. లాక్డౌన్ ముగిసిన అనంతరం సదరు వినియోగదారులు ఆయా దుకాణాలకు వచ్చి రసీదు చూపించి నగలు పొందవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో, శుక్రవారం ఆన్లైన్లో అధిక వ్యాపారం జరిగే అవకాశముందని ఆయన తెలిపారు.