‘అందరూ తిడుతున్నారు.. వేరే వేషం వెయ్యాల్సింది.. అని అమ్మ అంది..’

ABN , First Publish Date - 2020-02-02T01:37:32+05:30 IST

సీనియర్ నటుడు, రచయిత.. గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం(12-12-2019)

‘అందరూ తిడుతున్నారు.. వేరే వేషం వెయ్యాల్సింది.. అని అమ్మ అంది..’

రెమ్యూనరేషన్ ఇస్తా... మాతో మాట్లాడండని నా భార్య కోరింది

సినిమాలు తగ్గించలేదు.. అవకాశాలే తగ్గాయి..

కెరీర్ పిచ్చిలో ఫ్యామిలీని మిస్ చేశా

ప్రజల సొమ్ము దోచి దొరలా తిరుగుతున్నారు

హిట్లర్‌లా తెగించే రోజు వస్తుందేమో

పోస్టర్‌ పెట్టుకునే దౌర్భాగ్యపు దశకు వచ్చావని నాన్న అనుకునేవారు

నాలోని రచయితను... నటుడు డామినేట్‌ చేశాడు

ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో గొల్లపూడి మారుతీ రావు


సీనియర్ నటుడు, రచయిత.. గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం(12-12-2019) తుదిశ్వాస విడిచారు. రేడియో వ్యాఖ్యాతగా కెరీర్‌ను మొదలుపెట్టిన గొల్లపూడి.. అంచెలంచెలుగా ఎదిగారు. సాహితీరంగంలో కూడా ఆయన విశేష కృషి చేశారు. తనయుడు శ్రీనివాస్ పేరుతో కొత్త దర్శకులకు ప్రోత్సాహకాలు, అవార్డులు అందిస్తూ వచ్చారు. రేడియో మాధ్యమం, నాటక రంగం, రచనా వ్యాసంగం, నటనా రంగం.. అన్నింటిలోనూ విలక్షణమైన ముద్రను వేసుకోవడం ఎవరికైనా కష్టమైన పని. కాని గొల్లపూడి మారుతీరావుకు మాత్రం వెన్నతోపెట్టిన విద్య. ఆయన రాత ఎంత పదునైనదో, నటన అంతకంటే ఉద్వేగభరితమైనది. తన జీవితంలోని ఎత్తుపల్లాలను 30-12-2013న జరిగిన ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో.. ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణతో ఆయన పంచుకున్నారు.. ఆ కార్యక్రమ పూర్తి వివరాలు..


ఆర్కే : నమస్కారం గొల్లపూడి మారుతీరావుగారు. ఎలా ఉన్నారు? చాలా ఏళ్ల తర్వాత కలిశారు.

గొల్లపూడి: బావున్నాను. ఆంధ్రజ్యోతిని కలిస్తే సంప్రదాయాన్ని కలిసినట్లు ఉంటుంది. ఈ పత్రికతో నాకు చాలా బంధం ఉంది. ‘జీవనకాలమ్‌’ కొన్నేళ్ల పాటు రాశాను.


ఆర్కే : ఇక్కడ తెలుగువాళ్లు కొట్టుకుంటుంటే మీరు మద్రాసులో కూర్చుంటే ఎలాగండీ (నవ్వుతూ)?

గొల్లపూడి: నేను మద్రాసులో ఉండేందుకు కారణం - ఆ రోజుల్లో మద్రాసులో సినీ పరిశ్రమ ఉండటం. ఒరిస్సాలో ఆలిండియా రేడియో నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని మద్రాసుకు వచ్చాను. సినిమా ఇండసీ్ట్ర హైదరాబాద్‌కు వెళ్లిపోయేనాటికి కెరీర్‌లో నిలబడ్డాను. పిల్లలు స్థిరపడటం మొదలుపెట్టారు. ఏ లక్నోలోనో రాయపూర్‌లోనో ఉంటే తెలుగువాళ్లకు దూరమయ్యామనిపిస్తుంది. కాని మద్రాసులో అలా అనిపించదు. అందువల్ల 43 ఏళ్లు మద్రాసులోనే ఉండిపోవాల్సి వచ్చింది.


ఆర్కే : అక్కడి నుంచి చూసినపుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు మీకేమనిపిస్తున్నాయి?

గొల్లపూడి: దూరంగా చూసేంత దూరంలో లేనండి. తెల్లవారిలేస్తే తెలుగువాళ్లతో మాట్లాడుతూనే ఉన్నాను. మా తరం చిన్న తెలుగు సమాజం ఇప్పటికీ మద్రాసులో ఉంది. నాకెందుకో ఈ విభజన ఎప్పుడో జరిగుండాల్సింది అనిపిస్తుంది. చరిత్ర చూస్తే ఉద్యమాలు జరుగుతూనే వస్తున్నాయి. చిన్న అసంతృప్తి ఉంటూనే ఉంది. అంతకంటే చెప్పవలసింది నాలాంటి వాడికి ఎక్కువ లేదు. ఇక్కడ ఆగుతాను నేను. ఎందుకు ఆగుతానో చెబుతాను (నవ్వుతూ).


విచిత్రంగా మా ఆవిడ తెలంగాణలో పెరిగింది. భువనగిరిలోని ఎలిమెంటరీస్కూల్‌లో చదువుకుంది. కరీంనగర్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సి, వరంగల్‌లో బీఏ చదువుకుంది. నా పెళ్లి హన్మకొండలో జరిగింది. వరవరరావుకు మా ఆవిడ క్లాస్‌మేట్‌. మా ముగ్గురు పిల్లలు హన్మకొండలోనే పుట్టారు. నేనేమో కొంతకాలం హైదరాబాద్‌లో పనిచేశాను. కాబట్టి ఎటూ మాట్లాడలేని పరిస్థితి.


మీరు వేషం వేస్తేనే ఈ సినిమా తీస్తానన్నాడు


ఆర్కే : మీ జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. రంగస్థలం, నాటకాలు, సినిమాలు, రచనలు.. మీరెంతో బహుముఖప్రజ్ఞాశాలి. ఇది ఎలా సాధ్యమైంది?

గొల్లపూడి: నాలో విపరీతమైన ఫైర్‌ ఉండేది. 14 వ ఏటనే కథ రాశాను. ఈ వయసులో ఇప్పటికీ ఇంత చురుగ్గా ఉన్నానంటే 54 ఏళ్ల కిందట ఇంకెంత ఉత్సాహంగా ఉండేవాణ్ణో ఊహించుకోండి. అప్పట్లో ఇన్నేసి తెలుగు పత్రికలు లేవు. ఇన్నేసి టీవీ ఛానళ్లు లేవు. ప్రతి పనినీ ఉపాధి కోణం నుంచే చూసేవారు. స్టామినా ఎక్కువ ఉండటం వల్ల పని చేయాలన్న తాపత్రయం ఎక్కువగా ఉండేది. దాన్ని వెంటిలేట్‌ చేయగలిగే వాతావరణం ఉండేది. నేను సినిమా రచయితను, నటుడ్ని అవుదామనుకోలేదు ఏ నాడూ. నటనకు ముందు రెండు దశాబ్దాలపాటు రచనలు చేశాను నేను.


గొట్టిపాటి మధుసూదనరావుగారు ‘మీరొక వేషం వేయాలండీ మారుతీరావుగారు’ అనేవారు. ఆలిండియా రేడియోలో వేషం వేయడం, రచనలు చేయడం నిషిద్ధం. అయినా చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్లం. నా రేడియో సహచరుల గురించి చెప్పాల్సివస్తే అదొక భువనవిజయాన్ని తలపించేది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, రావూరి భరద్వాజ, శంకరమంచి సత్యం, దాశరథి, జీవీ సత్యానంద్‌, స్థానం నరసింహారావు, జీవీ కృష్ణారావు, మునిమాణిక్యం నరసింహారావు, నాయిని సుబ్బారావు వంటి వాళ్లతో కలిసి పదిహేనేళ్ల కుర్రాడు (గొల్లపూడి) పనిచేస్తే అతని ఉత్సాహం ఎలా స్కై రాకెట్‌ అవుతుందో ఊహించండి.


ఒకరోజు దాశరథిగారు నన్ను పిలిచి ‘మారుతీరావు.. ఎక్కడుంటున్నావయ్యా? దుక్కిపాటి మధుసూదనరావుగారు నిన్ను కలుద్దామనుకుంటున్నారు’ అన్నారు. ‘అంత పెద్దాయన నన్నెందుకు కలుద్దామనుకుంటున్నారండీ’ అన్నాను. నేను గగన్‌మహల్‌ రోడ్డులో ఒక చిన్న షెడ్‌లో ఉండేవాణ్ణి. అక్కడికి దుక్కిపాటి, దాశరథిగార్లు వచ్చారు. ఒక చిన్న బల్లమీద కూర్చున్నారు. ఒక సినిమాకు కథ రాయమన్నారు. తాజ్‌మహల్‌ హోటల్‌ రూంనెంబర్‌ 18లో అప్పటి దాకా నేను రాసిన పుస్తకాలు దుక్కిపాటి మధుసూదనరావుగారి బెడ్‌ మీద ఉండడం చూశాను. ఆయనలో ఉన్న గొప్పదనం ఏమిటంటే - ఆంధ్ర నాటక కళా పరిషత్‌ నుంచి వచ్చినవారు కాబట్టి.. రచయితను కూర్చోబెట్టుకుని కొత్తదనాన్ని రాబట్టుకోవడం ఆయనకు బాగా తెలుసు. అలా వారి ప్రోత్సాహంతో రాసిన మొదటి సినిమా (కోడూరి కౌసల్యాదేవి నవల చక్రభ్రమణం) ‘డాక్టర్‌ చక్రవర్తి’. ఆ సినిమా ఫెయిర్‌కాపీ రాసిన మహానుభావుడు ఒకరున్నారు. ఆయనే కె.విశ్వనాథ్‌. ఆ సినిమాకు ఆయన కో- డైరెక్టర్‌.


ఆర్కే : మీరు తొలి రెమ్యునరేషన్‌ ఎంత తీసుకున్నారు?

గొల్లపూడి: అప్పట్లో రెమ్యునరేషన్‌ గురించిన ఆలోచనే లేదు. ఇప్పుడు రూపాయి విలువ మారిపోయింది. నా పెళ్లయ్యేనాటికి రేడియోలో నా జీతం వంద రూపాయలు. వంద అంటే ఆ రోజుల్లో ఒక తులం బంగారం. నేను చాలా బాగా రాశానని.. వెయ్యినూట పదహార్లు ఇచ్చారు దుక్కిపాటిగారు. అప్పట్లో దాని విలువ ఎక్కువ. ఇప్పటి ప్రేక్షకులకు ఆ డబ్బు విలువ తెలియాలంటే ఒకటి చెబుతాను. తొంభై అయిదు రూపాయలు పెడితే.. గ్యాస్‌ సిలిండర్‌, స్టవ్‌ వచ్చేవి.


ఆ తర్వాత - నేను ఒక కుర్రాడికి సినిమా కథ రాసిచ్చాను. అప్పుడే హైస్కూల్‌లో క్లాసుఎగ్గొట్టి వచ్చిన కుర్రాడిలా ఉండేవాడతను. ఆ కుర్రాడి పేరు కోడిరామకృష్ణ. ‘మారుతీరావుగారు మీరు వేషం వేస్తేనే ఈ సినిమా తీస్తాను’ అన్నాడు నిర్మాత కె.రాఘవ. నేనప్పటికి రచయితను మాత్రమే. ఎంతోమంది నటులు ఉండగా నన్నే ఎందుకు నటించమంటున్నారు అని సరదాగా అడిగాను. లేదు.. లేదు.. మీరు వేషం వేయాల్సిందే అన్నారాయన. అలా మొదటివేషం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో వేశాను.



ఆ తర్వాత కూడా నటించారు....? ఇష్టం లేకుండానే నటించారా?

అప్పటికి నా వయసు 42 ఏళ్లు. నా పిల్లలకు అప్పుడొక మాట చెప్పాను ‘‘ఈ సినిమాకు సంబంధించిన ఒక మంచి ఫోటో తీసి జాగ్రత్తగా దాచిపెట్టండ్రా. ఈ దిక్కుమాలిన పని చేశానన్న జ్ఞాపకమైనా మిగులుతుంది. మళ్లీ నటించమని ఇంకెవ్వరూ పిలవరు. ఈ వయసులో నటనలోకి వెళ్లి ఏమి ఉద్ధరిస్తాను’ అని చెప్పాను. అయితే ఆ సినిమానే నాకు లైఫ్‌ ఇచ్చింది. ఒక రోజు మధ్యాహ్నం నేను నిద్రపోతుంటే.. చిరంజీవిగారు ఫోన్‌ చేశారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా రిలీజ్‌ కాకముందే అందులోని ఒక సన్నివేశాన్ని క్రాంతికుమార్‌కు చూపించారాయన.


వెంటనే క్రాంతికుమార్‌ తీయబోయే సినిమాలో నన్ను బుక్‌ చేసుకుని అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. ఈ ఫేసును ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనుకున్నాను. కాని ఆ తర్వాత 30 ఏళ్లు ఏకధాటిగా నటించాను. అయితే నాలోని రచయితను నటుడు డామినేట్‌ చేయడం బాధ అనిపిస్తుంది. మొన్న ఒకసారి స్వీడన్‌కు వెళితే - అక్కడొకాయన ‘మీరు రచనలు కూడా చేశారా?’ అన్నాడు. అప్పుడప్పుడు మన వాళ్లు కూడా ఇలా అడుగుతుంటారు. అప్పుడు నవ్వొస్తుంది.


ఆర్కే : మీకు సాహిత్యం మీద జిజ్ఞాస ఎలా కలిగింది.. మీ కుటుంబ సభ్యుల వల్ల అలవడిందా?

గొల్లపూడి: నాటకాలు, సినిమాలు, కథలు రాసి చెడిపోతున్నానని.. మా అమ్మగారు అనేవారు. మా నాన్నగారైతే నాతో మాట్లాడేవారే కాదు. ఒక హోటల్‌లో ‘గొల్లపూడి మారుతీరావు నటించు..’ అని ఒక చిన్న పోస్టరు అతికించారు. దాన్ని చూసిన నాన్న- ‘బీఎస్సీ ఆనర్స్‌ చదువుకున్న నువ్వు కోమలవిలాస్‌లో పోస్టర్‌ పెట్టుకునే దౌర్భాగ్యపు దశకు వచ్చావు’ అనుకున్నాడట. ఇవాళ ఇన్నేసి థియేటర్లు, టీవీచానళ్లు... ఇంత ఎక్స్‌పోజర్‌ వస్తుందని ఆయన ఊహించలేదు. ఇవన్నీ డబ్బులు ఇవ్వగల ప్రొఫెషన్స్‌ అవుతాయన్న సంగతీ తెలియదు.


ఒక తల్లి తన కూతురును ప్రపంచం గర్వించదగ్గ టెన్నిస్‌ ప్లేయర్‌గా తయారుచేయాలని అలాంటి ప్లేయర్‌ పేరే పెట్టుకుంది. ఆ అమ్మాయి పేరు మార్టినా హింగిస్‌. పెట్టుకున్న పేరు మార్టినా నవ్రతిలోవా. మా అమ్మ , నాన్నలు నన్ను అలా ప్రోత్సహించలేదు. వాళ్లు ప్రోత్సహించి ఉంటే నేను ఇంకా ఎక్కడికో వెళ్లేవాడ్నేమో. కేవలం సర్వైవల్‌ కోసమే కష్టపడ్డాను.


ఆర్కే : మీరు నటుడు కావడం మీ అమ్మానాన్నకు నచ్చేది కాదా?

గొల్లపూడి: ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాను మా అమ్మకు నాన్నకు చూపించాలనుకున్నా. వాళ్లిద్దర్నీ థియేటర్‌కు తీసుకెళ్లాను. నాలుగైదు సీన్లు అయ్యాయి. మా అమ్మ ఏమీ రియాక్టు కావడం లేదు. ‘సినిమా చూస్తున్నావా అమ్మా. అందులో ఉన్నది నేనే’ అన్నాను. సినిమా అంతా పూర్తయ్యాక కారులో వెళుతున్నపుడు మరోసారి అడిగితే ‘ఏమోరా ఆ సినిమాలో నిన్ను అందరూ తిడుతున్నారు. ఇంకో వేషం ఉందే అది వేయాల్సింది’ అంది. ఇంకో వేషం అంటే చిరంజీవి వేషం (నవ్వులు). అమ్మ అనే పరిధి నుంచి ఆవిడ బయటికి వచ్చి నన్ను చూడలేకపోయింది. ‘అభిలాష’ కోసం శ్మశానంలో నటించాల్సి వచ్చింది. అప్పుడు కూడా ‘నువ్వు నటించడానికి వీల్లేదు’ అంది అమ్మ. ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు కూడా ‘అమ్మా నేను అక్కడ పెద్ద డ్యూటీ ఆఫీసర్‌ను..’ అంటే - ‘నువ్వు రేడియోలో ఏమైనా మాట్లాడతావా?’ అనేది. ‘నేను మాట్లాడేవాళ్లకు ఇంఛార్జిని’ అన్నాను. ‘ఎందుకు ఆ దిక్కుమాలిన ఉద్యోగం. కనీసం మాట్లాడితేనైనా రేడియోలో వినొచ్చు కదా!’ అనేది.


ఒక రోజు హైదరాబాద్‌ రేడియో స్టేషన్‌కు వచ్చింది అమ్మ. అక్కడ స్థానం నరసింహారావుగారు కనిపించారు. ఆయనకు అమ్మను పరిచయం చేయగానే - ‘బాగా రాస్తాడమ్మా వీడు. మంచి కుర్రాడు’ అన్నారాయన. నరసింహారావుగారిని అమ్మ గుర్తుపట్టింది. ‘వీళ్లందరి దగ్గర పనిచేస్తున్నావా నువ్వు.. పోన్లే మంచి ఉద్యోగమే’ అంది. నేను పనిచేసే ఆలిండియా రేడియో కంటే వాళ్లు పనిచేస్తున్న ఆలిండియా రేడియోనే ఆవిడకు గొప్పగా అనిపించింది.


రైటింగ్‌ ఈజ్‌ మై వైఫ్‌


ఆర్కే : రచయిత, నటుడు.. ఈ రెండింటిలో మీకేదంటే ఇష్టం?

గొల్లపూడి: ఈ ప్రశ్నను చాలామంది అడుగుతుంటారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే సమాధానం. రైటింగ్‌ ఈజ్‌ మై వైఫ్‌. యాక్టింగ్‌ ఈజ్‌ మై మిస్ట్రెస్. ఎప్పటికప్పుడు నాకు ఆనందాన్నిచ్చే, ఉత్సాహాన్నిచ్చి నన్ను ఆదుకునేది రచనే.


ఆర్కే : నటుడిగా మీ జీవితం ఎలా గడిచింది..

గొల్లపూడి: రేడియో అనుభవానికి తోడు ఒకప్పుడు నేను స్టేజి ఆర్టిస్టును కూడా. అందుకని సినిమా అనేది సులువైంది. తొలి సినిమా తర్వాత ‘మనిషికో చరిత్ర’, ‘ఇది పెళ్లంటారా’, ‘తరంగిణి’లో విలక్షణమైన పాత్రలు వేశాను. వీటిలో రెండు సినిమాలు ఏడాదిపాటు ఆడాయి. మూడో సినిమాకే ద్విపాత్రాభినయం చేసే అవకాశం వచ్చింది. ఒక నటుడు అయిదేళ్లపాటు నటిస్తే ఎలాంటి పాత్రలు వస్తాయో.. నాకు తొలి అయిదు సినిమాలకే అలాంటి పాత్రలు వచ్చాయి. ఆ తర్వాత ఇరవై ఏళ్లు వెనక్కిచూసుకోలేదు. నేను ఏ కారు ఎక్కుతున్నానో, ఏ డ్రెస్సు మారుస్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో తెలిసేది కాదు.


ఆర్కే : సినిమాల్లో నటించడం ఎందుకు తగ్గించారు?

గొల్లపూడి: తగ్గించాను అనేదానికంటే అవకాశాలు తగ్గాయి అనడం సబబు. ఇప్పుడు ఏ సినిమాల్లో తండ్రులు ఉన్నారు? ఏ సినిమాల్లో మేనమామలు ఉంటున్నారు? ఏ సినిమాల్లో వృద్ధుల సమస్యలు ఉంటున్నాయి? ఏ సినిమాల్లో పిల్లలు కనిపిస్తున్నారు? ఎక్కడ సంసారం చదరంగం ఉంది? ఎక్కడ తరంగిణి ఉంది? ఎక్కడ గద్దముక్కు పంతులు ఉన్నాడు? ఇవాళ మాలాంటి నటుల అవసరమే లేదు. ఆ రోజుల్లో మంచి కథలు వచ్చేవి. కుటుంబం ఐడెంటిటీ చేసుకోగలిగిన కథల్లో నుంచి పాత్రలు వచ్చేవి. ఇప్పుడు పాత్రల అట్రాక్షన్‌ కోసమే కథలు వస్తున్నాయి. సినిమా అనేది వస్తూత్పత్తిలాగ అయిపోయింది.


ఆర్కే : కాలం మారుతోంది కదా?

గొల్లపూడి: అవును. సినిమాలే కాదు. పిల్లల అభిరుచులు, ఆలోచనలు కూడా మారుతున్నాయి. నా పిల్లలకు పెళ్లి అయ్యేటప్పుడు మా వియ్యంకుల వారికి రెండు షరతులు పెట్టాను. ఒకటి- మీరేమీ నాకు కట్నం ఇవ్వక్కర్లేదు అని. రెండోది- ఇంట్లో కోడళ్లు సల్వారు కమీజులు, నైట్‌గౌన్లు వేయకూడదు అని. 24 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నా కోడళ్లు ఏ రోజూ ఈ షరతులను ఉల్లంఘించలేదు.


ఆర్కే : మరి, మీ కోడళ్ల స్వేచ్ఛను హరించినట్లే కదా?

గొల్లపూడి: హరించినట్లే మరి. అది యారగెన్సీనే (నవ్వులు). దాన్ని చెల్లేటట్లు చెయ్యగలిగే వాళ్లతో కాబట్టి చెల్లింది. చెల్లక్కర్లేని, చెల్లడానికి కూడా ఆలోచించని మరో తరం వచ్చిందిప్పుడు. మనల్ని నోరుమూసుకుని కూర్చోమని కూడా చెప్పింది. కాబట్టే ఊరుకున్నాం. మా అబ్బాయి అప్పుడప్పుడు అంటుంటాడు ‘అదే షరతులు మీ మనవళ్లు, మనవరాళ్లకు పెట్టండి చేతనైతే’నని. అది సాధ్యం అయ్యేపని కాదు అని చెబుతుంటాను.


ఆర్కే : రాజకీయాల మీద తీవ్రమైన వాఖ్యలు చేసేవారు కదా? చట్టసభల్లో దొంగలున్నారని అనేవారు. అప్పట్లోనే దొంగలు ఉన్నారంటే ఇప్పుడు ఎలాంటి వారున్నారని?

గొల్లపూడి: ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది. అవినీతి చేసినవాళ్లే మేము చేయలేదని టీవీల ముందుకొచ్చి ధైర్యంగా వాదిస్తున్నారు. మునుపటికంటే ఈ ధోరణి పెరిగింది. మా నాన్న ఓ కథ చెప్పేవాడు - ఒక దొర తాగుడుకు అలవాటు పడి ఆఫీసు సొమ్ము వాడుకోవడం అలవాటు చేసుకున్నాడట. ఇంగ్లండు నుంచి పై అధికారి వస్తున్నాడని తెలిసి.. రెండొందల యాభై రూపాయలు వాడుకున్న విషయం అతనికి తెలిస్తే, ముఖమెలా చూపించాలని.. బీచ్‌కు వెళ్లి షూట్‌ చేసుకుని చచ్చిపోయాడట. ఇవాళ లక్షా డెబ్బైఅయిదు వేల కోట్లు అవినీతి చేసినవాడు కూడా.. చేయలేదని గర్వంగా చెబుతున్నాడు. అవినీతి చేసిన వాళ్ల పేర్లు కూడా ప్రముఖంగా రాస్తున్నారు. బురదలో నుంచి పద్మం వికసించినట్లుగా.. బహుశా కొత్త మలుపు వస్తుందేమోనని ఆశిస్తున్నాను.


కెరీర్‌లో పడి ఫ్యామిలీని మిస్‌ అయ్యా


ఆర్కే : మీరు ఇంత అనుభవజ్ఞులు కదా! సామాన్యుల చేతిలో మహామహులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాని సమాజంలో మౌలికమార్పు రాలేదు ఎందుకని?

గొల్లపూడి: ఇదివరకటిలా కాదు. తమ విసుగుదలను, అసహనాన్ని, విచక్షణను చెప్పగలిగే ఆయుధం తన చేతిలో ఉంది అనే విషయాన్ని ఓటర్లు ఎప్పటికప్పుడు చెబుతున్నారు. లోక్‌పాల్‌ బిల్లు అంశం, సమాచార హక్కు చట్టం.. ఇవన్నీ అందులో భాగమే.


ఆర్కే : కాని అవినీతిని ఆమోదించే ధోరణి పెరుగుతోంది.

గొల్లపూడి: ఓటరు తన ఆలోచనను నిర్దిష్టంగా చెప్పగలిగిన నాడు.. మార్పు వస్తుంది. హిట్లర్‌ను మనం అసహ్యించుకుంటున్నాం కాని ఎటువంటి పరిస్థితులలో వారు హిట్లర్‌ను ఆదరించారు?- వర్సెల్స్‌లో జర్మనీ వాళ్లను కూర్చోబెట్టి ఫ్రాన్స్‌ బలవంతంగా సంతకాలు చేయించుకోవడం, ఆ దేశ ప్రజలు అవమానాలను ఎదుర్కోవడం, ఊచకోతలకు గురికావడం.. వంటి పరిణామాల తర్వాత- ఎవరైనా మమ్మల్ని కాపాడితే బావుండనే నిర్వేదంలో నుంచి.. ‘నేను జర్మన్‌ను కాపాడతాను’ అని హిట్లర్‌ ముందుకొచ్చాడు. అందుకే ఆ నాయకుని ఉనికి చరిత్రలో నిలబడింది. ఆ తర్వాత హిట్లర్‌ పరిస్థితి ఏంటన్నది వేరే విషయం. అలాంటి మాస్‌ రియాక్షన్‌ మన దేశంలోనూ వస్తుందేమో అనిపిస్తుంది.


ఆర్కే : మీ కుటుంబం గురించి..

గొల్లపూడి: నాకు ముగ్గురు అబ్బాయిలు. ఒకరు పోయారు. ఇద్దరు ఎమ్మే ఇంగ్లీషు లిటరేచర్‌ చేశారు. పిల్లలకు ఆంగ్లసాహిత్యాన్ని ఇంట్లోనే బోధించాను. నా నాటకం మీదనే నా కొడుకు మధురాంతకం నరేంద్ర దగ్గర పరిశోధన చేశాడు. మాకు ఇంటర్నేషనల్‌ టికెటింగ్‌ చేసే ట్రావెల్స్‌ ఉంది. నాకు అయిదుగురు మనవరాళ్లు. ఒక మనుమడు. మా కుటుంబంలో 42 ఏళ్లు ఆడపిల్లలు లేరు. ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లలున్నారు. చాలా ఆనందమేస్తుంది.


ఆర్కే : యువతరాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది?

గొల్లపూడి: వాళ్లలో అజ్ఞాతంగా ఉన్న శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. వాళ్లకున్న రిజర్వాయర్‌ ఆఫ్‌ ఎనర్జీని కాని, నింపుకోవలసిన జీనియస్‌ను కాని.. నింపుకోకుండా బయటికొస్తున్నారు. ఇవాళ మీడియా అనేది బ్లాస్ట్‌. ఒక చిన్న పని చేస్తే పదహారు ఛానళ్లు వాడిని మహానుభావుడ్ని చేస్తున్నాయి. నెగటివ్‌ ఏంటంటే - పదహారేళ్లున్న ఓ కుర్రాడు లెక్చరర్‌ చొక్కా పట్టుకున్నా అన్ని ఛానళ్లు చూపిస్తున్నాయి. అలా చూపిస్తే వాడేమవుతాడు? హీరో అవుతాడు.


ఆర్కే : నటుడిగా బిజీ అయ్యాక మీలోని రచయితను పట్టించుకోలేకపోయారా?

గొల్లపూడి: నిజం చెప్పాలంటే ఒక దశలో రచనను మానుకున్నాను. టైమ్‌ ఉండేది కాదు. అయిదు కాల్షీట్లు పనిచేసిన రోజులు ఉన్నాయి. అంత బిజీలో ఒక రోజు రామారావుగారు ఫోన్‌ చేసి.. ఒక సినిమాకు రాయమంటే ‘ఇప్పుడు రాస్తున్న అయిదు సినిమాలూ మీవే. మరొకటంటే కష్టం’ అన్నాను. అప్పుడే -ఒక రోజు రాత్రి మా ఆవిడ నా దగ్గరికి వచ్చి ‘ఏమండీ మీరు సినిమాకు ఎంత పుచ్చుకుంటారండీ’ అంది. నేను చెప్పాను. ‘నేనొక పనిచేస్తానండి. ఆ అమౌంట్‌ మీ అకౌంట్‌లో వేస్తాను. నాక్కూడా ఒక గంట టైమ్‌ ఇవ్వండి..’ అంది. ఆ మాట విన్నాక రాస్తున్న కలాన్ని కిందపడేశాను.


‘ఆ గంటలో ఏం చేస్తావ్‌?’ అన్నాను. ‘ఆ గంటలో మన అబ్బాయికి ఎలాంటి బట్టలు కుట్టిద్దాం, ఊరికి వెళ్లినప్పుడు వాడు ఏం చేశాడు, ఎన్నో క్లాసు చదువుతున్నాడు, ఏ పుస్తకం చదువుతున్నాడు.. ఇవాళ ఏ కూర వండుదాం.. ఇవన్నీ చెబుతాను’ అని చెప్పింది. నేను కెరీర్‌లో పడి ఫ్యామిలీని మిస్‌ అయ్యాను అన్న సంగతి అర్థమైంది.


నా అభిరుచిని పెట్టుబడిగా పెట్టి జీవించే జీవితం నాకొచ్చింది. ఇదొక అదృష్టంగానే భావిస్తాను. నాటకం రాస్తే ఆలిండియా రేడియో.. కథ రాస్తే ఆంధ్రప్రభ, మరొకటి రాస్తే ఆంధ్రజ్యోతిలో వచ్చేది. జాబ్‌ శాటిస్‌ఫాక్షన్‌ ఉండేది.


నేను పాడయ్యే దశలో డబ్బు, కీర్తి రాలేదు. లేదా, నేను పాడయ్యేంత రాలేదు.


అప్పట్లో నా యారగెన్సీని న్యూట్రలైజ్‌ చేసే పెద్దరికం నా చుట్టూ ఉండేది. అందుకే నా కాళ్లు ఎప్పుడూ నేల మీదే ఉండిపోయాయి.


జీవితంలో ఇది కావాలి అని అర్రులు చాచే అవసరం నాకెప్పుడూ రాలేదు. అందుకే జీవితంలో అసంతృప్తి లేదు నాకు. ఐయామ్‌ హ్యాపీ.


Updated Date - 2020-02-02T01:37:32+05:30 IST