ఘనంగా బోనాలు
ABN , First Publish Date - 2021-08-04T04:58:12+05:30 IST
ఘనంగా బోనాలు
వికారాబాద్/తాండూరు రూరల్/బంట్వారం: వికారాబాద్ పట్టణంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఎన్నెపల్లి, బీటీఎస్, ఇంద్రానగర్, అంబేద్కర్నగర్ కాలనీలో బోనాలు పండుగ ఉత్సవాలు జరుగగా అమ్మవార్లకు బోనాలు, నైవేధ్యాలు సమర్పించారు. ఇంద్రానగర్ బోనాలు కాలనీ నుంచి కొత్తగంజ్లో ఉన్న అమ్మవారి దేవాలయం వరకు పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాల మధ్య ముందుకు సాగాయి. సుమారు మూడు గంటల పాటు జరిగిన బోనాల ఊరేగింపులో కాలనీ మహిళలు వారి బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం దేవాలయం వద్ద అమ్మ వారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కాలనీ పెద్దలు, కాలనీవాసులు పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరు మండల పరిధిలోని ఐనెల్లి, మల్కాపూర్ గ్రామాల్లో బోనాలతో పోచమ్మ అమ్మవారికి సమర్పించారు. అదేవిధంగా బంట్వారం మండలంలోని యాచారం గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొని పోచమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ బల్వంత్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, శరణారెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.