‘అమూల్’తో పాడి రైతుకు మేలు
ABN , First Publish Date - 2020-12-03T05:07:50+05:30 IST
పాడి రైతుల మేలు కోసమే అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు. అమూల్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమూల్ ద్వారా పాడి రైతుకు అధిక ఆదాయం లభించనుందని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి జగన్
కలెక్టరేట్, డిసెంబరు 2: పాడి రైతుల మేలు కోసమే అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు. అమూల్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమూల్ ద్వారా పాడి రైతుకు అధిక ఆదాయం లభించనుందని తెలిపారు. ‘పాదయాత్ర సమయంలో పాడి రైతుల సమస్యలు తెలుసుకున్నా. లీటర్ పాలకు అదనంగా నాలుగు రూపాయల ధర కల్పిస్తామని వారికి హామీ ఇచ్చా. అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ ధర రూ.5 నుంచి రూ.7 వరకు పెరిగి పాడి రైతుకు మేలు జరుగుతుంది. ఆ సంస్థకు వచ్చే లాభాలను తిరిగి పాడి రైతులకు బోనస్ రూపంలో చెల్లిస్తారు. రాష్ట్రంలో 9,890 గ్రామాల్లో ఆటోమెటెడ్ పాలసేకరణ కేంద్రాలు, బల్క్మిల్క్ కూలింగ్ యూనిట్లు, ప్రొసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 4.69లక్షల మంది మహిళలు పాడి పశువులు కావాలని కోరారు. వారందరికీ దశల వారీగా పశువులను అందిస్తాం. తొలిదశలో ఈ కార్యక్రమాన్ని ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రారంభించి ఏడు వేల యూనిట్లు పంపిణీ చేస్తాం. వచ్చే ఆగస్టు నాటికి నాలుగు లక్షల యూనిట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా’మని ముఖ్యమంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ జె.నివాస్, జేసీలు సుమిత్కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, డీఆర్డీఏ పీడీ బి.శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.