సింగరేణి కార్మికులకు శుభవార్త
ABN , First Publish Date - 2021-10-07T13:25:00+05:30 IST
సింగరేణి కార్మికులకు శుభవార్త..
సింగరేణిలో ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షలు!
రేపు దసరా పండగ అడ్వాన్స్
11న లాభాల బోనస్.. 1న దీపావళి బోనస్
కార్మికులకు పండగ శుభాకాంక్షలు తెలిపిన సీఎండీ శ్రీధర్
హైదరాబాద్/కొత్తగూడెం(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు శుభవార్త. సీఎం కేసీఆర్ ప్రకటించిన 29% లాభాల బోనస్ సొమ్మును ఈ నెల 11న కార్మికులకు చెల్లించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. అలాగే దీపావళి బోన్సను నవంబరు 1న కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి ఉద్యోగులు, కార్మికుల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 29% లాభాల బోనస్ కింద కంపెనీ రూ.79.07 కోట్లను పంపిణీ చేస్తోందన్నారు.
దీపావళి బోనస్ చెల్లింపులకు సంస్థ రూ.300 కోట్లను వెచ్చిస్తోందని దీని ద్వారా ప్రతి కార్మికుడు రూ.72,500 వరకు అందుకోనున్నారని తెలిపారు. సింగరేణి సంస్థ దసరా పండగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేలను ప్రకటించిందని, ఈ డబ్బును శుక్రవారం చెల్లిస్తామని చెప్పారు. ఈ బోన్సలు, పండగ అడ్వాన్స్ కలిపి కార్మికులు మూడు వారాల్లో సగటున రూ.1.15 లక్షల వరకు అందుకోనున్నారని పేర్కొన్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు శ్రీధర్ దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.