ఒకటినే మీకెందుకో జీతాలు..!

ABN , First Publish Date - 2021-11-04T14:41:38+05:30 IST

‘‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కాస్త..

ఒకటినే మీకెందుకో జీతాలు..!

బుగ్గనకు బుచ్చయ్య ప్రశ్న


అమరావతి(ఆంధ్రజ్యోతి): ‘‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కాస్త ఆలస్యం అయితే ఏమవుతుంది? అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వారిని తీసిపారేసినట్లు మాట్లాడారు. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు ఠంఛనుగా ఒకటో తేదీనే ఎందుకు జీతాలు తీసుకొంటున్నారు? మీకైతే సమయానికి జీతాలు కావాలిగాని వాటిపైనే బతికే ఉద్యోగులకు సకాలంలో ఎందుకివ్వరు?’’ అని టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఏదో దాన ధర్మం చేస్తున్నట్లు బుగ్గన, సలహాదారు సజ్జల మాట్లాడుతున్నారని, కీలక స్థానాల్లో ఉన్నవారు బాధ్యతారాహిత్యంతో మాట్లాడటం సరికాదని అన్నారు. కరోనా వల్ల ఆదాయం తగ్గిందని ప్రభుత్వం బుకాయిస్తోందని విమర్శించారు. జగన్‌ రెడ్డి ప్రభుత్వం నిర్వాకంతో ప్రపంచ బ్యాంక్‌ కూడా ఏపీకి అప్పులు ఇవ్వని పరిస్థితి వచ్చిందన్నారు.


పర్సంటేజీలు ఇస్తే తప్ప బిల్లులు ఇవ్వని అవినీతిని ఈ ప్రభుత్వం పెంచి పోషించడంతో ప్రపంచ స్థాయి రుణ సంస్థలు దూరం అవుతున్నాయని ఆరోపించారు. అప్పులు తేవడానికి పరిమితి నాలుగు శాతం ఉంటే ఈ ప్రభుత్వం ఏకంగా 11 శాతం మేరకు తెచ్చిందని, రాష్ట్రాన్ని ఇంత ఘోరంగా అప్పుల ఊబిలోకి దించిన ప్రభుత్వం చరిత్రలో మరొకటి లేదని ఆయన వ్యాఖ్యానించారు. అప్పు పత్రాల్లో గవర్నర్‌ పేరు పెట్టడంపై బుగ్గన సమర్ధన విడ్డూరంగా ఉందని బుచ్చయ్య అన్నారు. 

Updated Date - 2021-11-04T14:41:38+05:30 IST