ప్రభుత్వ నిర్ణయాల వల్లే మధిరలో కరోనా

ABN , First Publish Date - 2020-05-20T10:21:11+05:30 IST

ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారిని అనుమతించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని, మధిర

ప్రభుత్వ నిర్ణయాల వల్లే మధిరలో కరోనా

కట్టడిలో రాష్ట్రప్రభుత్వం విఫలం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క


మధిర టౌన్‌, మే 19: ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారిని అనుమతించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని, మధిర మండలం మహదేవపురంలో ఒకరికి పాజిటివ్‌ రావడానికి కూడా ఇదే కారణమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 55రోజులుగా అధికారులు, ప్రజలు ఒక తపస్సులా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించారని.. కానీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో అది కాస్తా బూడిదపాలైందన్నారు.


కరోనా కట్టడిలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆయన.. ప్రభుత్వం వలస కూలీలకు ఇచ్చిన సడలింపులతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌ చేయడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. స్వస్థలాలకు చేరుకున్న వారిని 14రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచి అన్నిపరీక్షలు చేసిన తర్వాత వారివారి గ్రామాల్లోకి అనుమతించినట్లయితే ఈ ముప్పు ఉండేది కాదన్నారు.


అలాగే మద్యంషాపులు తెరవడం కూడా కరోనా వ్యాప్తికి కారణమైందని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలవల్లేనని, భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వలస కార్మికుల సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని తక్షణమే మండలానికి ఒక క్వారంటైన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి వారిని అక్కడ ఉంచాలని అవసరమైతే తన సొంతఖర్చులతో క్వారంటైన్‌ సెంటర్లో ఉన్నవారికి భోజన సదుపాయాలు కల్పిస్తానన్నారు. 

Updated Date - 2020-05-20T10:21:11+05:30 IST