ఆస్పత్రుల్లో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది: పేర్ని నాని
ABN , First Publish Date - 2021-09-16T22:53:47+05:30 IST
ఆస్పత్రుల్లో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: ఆస్పత్రుల్లో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాడు-నేడులో భాగంగా విరాళాలిచ్చే దాతల పేర్లు స్కూళ్లు, ఆస్పత్రులకు పెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నకిలీ మందులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. 1983 నుంచి ఆగస్టు 15, 2011 వరకు లక్షల మంది పేదలు ఇళ్ల పట్టాలు కుదువ పెట్టారన్నారు. 46 లక్షల మందికి వన్ టైం సెటిల్మెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, పల్లెల్లో 42 లక్షల 3907 మంది, పట్టణాల్లో 4 లక్షల మందికి పథకం వర్తిస్తుందని తెలిపారు. డిసెంబర్ 21న ఈ దరఖాస్తుదారులకు ఆస్తిపత్రాలు అందించడం.. రూ.14,609 కోట్లు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కారిస్తామని పేర్ని నాని చెప్పారు.