ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నిరసన

ABN , First Publish Date - 2021-12-09T06:23:16+05:30 IST

సీపీఎస్‌ రద్దు, పెండింగ్‌ డీఏలు, పీఆర్‌సీ మంజూరు పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండలంలోని పలు పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నిరసన
సీఎస్‌.పురంలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

సీఎ్‌సపురం, డిసెంబరు 8 : సీపీఎస్‌ రద్దు, పెండింగ్‌ డీఏలు, పీఆర్‌సీ మంజూరు పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండలంలోని పలు పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో మొండి వైఖరి వీడాలని ఈ సందర్బంగా వారు కోరారు.

ఉలవపాడు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ఐఎ్‌ఫటీయూ జిల్లా కార్యవర్గం సంఘీభావం తెలుపుతున్నట్లు జిల్లా కార్యదర్శి ఆర్‌ మోహన్‌ పేర్కొన్నారు. ఉద్యోగుల పీఆర్‌సీని వెంటనే ఇవ్వాలని, సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం కొనసాగించాలనే డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల రెండు జేఏసీలు ఐక్యంగా చేస్తున్న నిరసనకు ఐఎ్‌ఫటీయూ జిల్లా కార్యవర్గం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు కార్యదర్శి మోహన్‌ చెప్పారు.

కనిగిరి : ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీఎన్జీవో సంఘం తాలూకా అధ్యక్షుడు పీవీ.రమణారెడ్డి అన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌, జూనియన్‌ కళాశాలలో ఉపాధ్యాయులతో రెండవ రోజు బుధవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో సీయం జగన్‌రెడ్డి ఇచ్చిన హమీ మేరకు పాత పెన్షన్‌ విధానాన్ని, కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ, పీఆర్సీ అమలు వంటి కార్యక్రమాలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల ఉద్యోగుల జేఏసీ నాయకులు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రమణారెడ్డి, ప్రభుత్వ హైస్కూల్‌ ఉపాధ్యాయులు సంజీవి, పి.కోటిరత్నం, టి నాగపద్మజారాణి, బాలచంద్ర, నరసింహారావు, కోటిరెడ్డి, ఏవి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. 

ముండ్లమూరు : మండల యూటీఎఫ్‌ నూతన కార్యవర్గం బుధవారం ముండ్లమూరులో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఫణిదపు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా గోగుల కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులుగా మువ్వా శ్రీనివాసరావు, సహాధ్యక్షులుగా సానికముం్మ తిరుపతిరెడ్డి, సహాధ్యక్షురాలిగా ఎం విజయశ్రీ, కోశాధికారిగా దార్ల శ్రీనివాసరావు, మహిళా కన్వీనర్‌గా సీహెచ్‌ జ్యోతిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా హరిబాబు వ్యవహరించారు. తమ పై నమ్మకం ఉంచి రెండవ సారి కూడా ఎన్నిక చేసినందుకు మండల యూటీఎఫ్‌ ఉపాఽధ్యాయులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

సింహగర్జన పోస్టర్‌ ఆవిష్కరణ

కురిచేడు : సీపీఎస్‌ విధానం రద్దుకోరుతూ డిసెంబర్‌ 10న విజయవాడలో జరిగే సింహగర్జన సమావేశం విజయవంతం చేయాల్సిందిగా కురిచేడు మండలం సీపీఎస్‌ బాధితులు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో భాగంగా కురిచేడు బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కిరణ్‌కుమారి చేతుల మీదుగా పోస్టర్‌ ఆవిష్కరిం చారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహనరెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో రామసుబ్బారావు, శివరామక్రిష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T06:23:16+05:30 IST