ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ వెనక్కి తెస్తాం: మోదీ

ABN , First Publish Date - 2022-02-27T20:51:37+05:30 IST

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ వెనక్కి..

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ  వెనక్కి తెస్తాం: మోదీ

బస్తి: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్రం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో మార్చి 3న జరుగనున్న ఆరో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని బస్తిలో ఆదివారం ఏర్పాటు చేసిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు.


ప్రధాని తన ప్రసంగంలో విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. దేశభక్తికి, పరివార్ భక్తి (కుటుంబ భక్తి)కి చాలా తేడా ఉందని అన్నారు. గత కుటుంబ పాలకులు రక్షణావసరాల కోసం విదేశాలపై ఆధారపడేవని, కానీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్‌కే తాము ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. కులమతాలకు అతీతంగా దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా రూపొందించే సమయమిదేనని అన్నారు.


''మనకు  ఆయిల్ రిఫైనరీలు లేవు. క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. వాళ్లు ఎప్పుడూ దీనిపై దృష్టిపెట్టలేదు. ఇప్పుడు చెరకు సాయంతో ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇథనాల్ ప్లాంట్ నెట్‌వర్క్‌ను మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా పరివార్‌వాదీలు మన సైన్యాన్ని ఇతరదేశాలపై ఆధారపడేలా చేశారు. భారత రక్షణ రంగాన్ని ధ్వంసం చేశారు. కానీ, ఇవాళ యూపీలో మేము రక్షణ కేరిడార్ ఏర్పాటు చేశాం'' అని మోదీ పేర్కొన్నారు.


ఫిబ్రవరి 26వ తేదీని బాలాకోట్‌పై గగనతల దాడులు చేసిన రోజుగా దేశం జరుపుకొంటోందని, కానీ ఆనువశం పాలకులు మాత్రం దాడులకు రుజువులు అడుగుతోందని మోదీ విమర్శించారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సంత్ కబీర్ నగర్, సిద్ధార్ధ్‌నగర్, అంబేద్కర్ నగర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రధాని ఆదివారం ప్రచారం సాగించనున్నారు.

Updated Date - 2022-02-27T20:51:37+05:30 IST