విద్య, వైద్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-01-29T06:15:55+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు.
- నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు
సిరిసిల్ల ఎడ్యుకేషన్, జనవరి 28: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. శుక్రవారం సిరిసిల్లలోని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో మున్సిపల్ ఆధ్వర్యంలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యాన్ని ఐదేళ్లలో ఆధునికీరించాలనుకున్నట్లు, కరోనాతో ఈ రెంరేళ్లు ఆసుపత్రుల ఆధునికీకరణపై దృష్టిసారించినట్లు చెప్పారు. సిరిసిల్లలో ఆధునిక హంగులతో డయాగ్నటిక్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు పైపై హంగులు చూసి ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపేవారని, నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ టీచర్లు ఎవరికీ తీసిపోరనే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉన్న లాభాలను వివరించడంతో అడ్మిషన్లు పెరిగాయని, తల్లిదండ్రులకు భారతం తగ్గుతోందని అన్నారు. చాలా ప్రాంతాల్లో 10వ తరగతి తర్వాత ఆడపిల్లలను చదువు మాన్పించి పెళ్లిళ్లు చేస్తారని, దానిని దృష్టిలో పెట్టుకొని గురుకులాలను స్థాపించామని తెలిపారు. వాటిలో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందుతోందన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానకి రూ.7289 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వీటితో పాఠశాలల్లో అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం సిరిసిల్లలో 10 పాఠశాలలను తీసకున్నట్లు, అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్ దూర దృష్టితోనే పాఠశాలల్లో అభివృద్ది జరుగుతోందని, పిల్లలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేయించారని అన్నారు. రాబోయే రోజుల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్, జిందంకళాచక్రపాణి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్లు కల్లూరి రాజు, పోచవేని సత్య, రాపెల్లి దిగంబర్ దార్నం అరుణ, ఆకుల చిన్న, రాజిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ, ఎస్ఎంసీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.