చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపై సర్కారు తలవంచుకోవాలి: విజయశాంతి

ABN , First Publish Date - 2021-11-25T00:44:28+05:30 IST

చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపై సర్కారు తలవంచుకోవాలి: విజయశాంతి

చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపై సర్కారు తలవంచుకోవాలి: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో పురాణకాలపు మూసీనది, హుస్సేన్ సాగర్ నిర్వహణ తీరు తెన్నులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ చేసిన వ్యాఖ్యలు విని రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని ఆమె అన్నారు. మూసీని చూసి మురుగునీటి నాలా అనుకున్నానని... ఆయన అన్న మాటలు తెలంగాణ సర్కారుకు ప్రజారోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటన్నది అర్థమవుతుందని విజయశాంతి మండిపడ్డారు. కబుర్లకు మాత్రం కొరత లేకుండా జనాన్ని బురిడీ కొట్టించడంలో తెలంగాణ పాలకులు ఆరితేరిపోయారని విజయశాంతి విమర్శించారు. రాములమ్మ పోస్టు యథాతథంగా


''సీఎం కేసీఆర్ గారు ధనికరాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర రాజధాని... విశ్వనగరంగా ఆయన పదే పదే డబ్బా కొట్టుకునే హైదరాబాద్ నగరంలోని పురాణకాలపు మూసీనది, చారిత్రక హుస్సేన్ సాగర్ నిర్వహణ తీరుతెన్నులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ చేసిన వ్యాఖ్యలు విని రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలి. హుస్సేన్ సాగర్ వద్ద వెలువడుతున్న దుర్వాసనతో 5 నిమిషాలు కూడా నిలబడలేకపోయానని... హైకోర్టు పక్కనున్న మూసీని చూసి మురుగునీటి నాలా అనుకున్నానని... ఆయన అన్న మాటలు తెలంగాణ సర్కారుకు ప్రజారోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటన్నది అర్థమవుతుంది. ఇది చాలక... ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై సండే.. ఫన్ డే పేరిట ఏదో పర్యాటకాన్ని ఉద్ధరిస్తున్నట్టు జనాన్ని రప్పించి, నాలుగు షాపులు పెట్టించి, ఆ దుర్వాసన మధ్య వారందరినీ ఆనారోగ్యం పాలు చేస్తున్నారు. ఇప్పటికే జంటనగరాల్లో నాలుగు చినుకులు పడితే ప్రతి ప్రాంతమూ ఒక చెరువులా మారిపోయి కనీసం వారం పాటు తేరుకునే పరిస్థితి లేదు. రాజధానిని డల్లాస్... ఇస్తాంబుల్ ఇంకేవేవో చేస్తానని, గుంత కనబడితే వెయ్యి రూపాయలిస్తామని... కబుర్లకు మాత్రం కొరత లేకుండా జనాన్ని బురిడీ కొట్టించడంలో తెలంగాణ పాలకులు ఆరితేరిపోయారు. చీఫ్ జస్టిస్ గారు చెప్పినట్టు గుజరాత్‌లోని బీజేపీ సర్కారు అక్కడి సబర్మతీ నదిని స్వర్గతుల్యంగా మార్చిన తీరును కేసీఆర్ గారు గ్రహించాలి, అక్కడికి పీసీబీ బృందాలను పంపి అధ్యయనం చేయించాలి. ఒకనాడు లేక్ సిటీగా దాదాపు 600 పైచిలుకు చెరువులతో అలరారిన హైదరాబాద్ నగరం నేడు నరకానికి నకలుగా మారిందన్న చీఫ్ జస్టిస్ గారి ఆవేదనను ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. తెలంగాణలోని చాలా చెరువులు ఆక్రమణలకు గురై దాదాపు కనుమరుగైన పాపంలో అధికార పార్టీ నేతల పాత్ర కూడా ఉందనడం కాదనలేని సత్యం.'' అని విజయశాంతి పేర్కొన్నారు.

Updated Date - 2021-11-25T00:44:28+05:30 IST