ఇన్కం ట్యాక్స్ పోర్టల్లో సమస్యలు.. ఇన్ఫోసిస్ సీఈఓకు సమన్లు జారీ!
ABN , First Publish Date - 2021-08-22T21:48:53+05:30 IST
ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్లో తరచూ సమస్యలు తలెత్తుతుండటంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్లో తరచూ సమస్యలు తలెత్తుతుండటంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఈ విషయంలో సోమవారం నాడు ఆర్థిక మంత్రికి వివరణ ఇవ్వాలంటూ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్కు సమన్లు జారీ చేసింది. ఆదాయపు పన్ను శాఖ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ పోర్టల్ ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా ఇంకా సమస్యలు తొలగిపోలేదని ఆర్థిక శాఖ పేర్కొన్నట్టు తెలిపింది.
కొత్త ఇన్కం ట్యాక్స్ పోర్టల్ను ఇన్ఫోసిస్ సంస్థ రూపొందించిన విషయం తెలిసిందే. జూన్ 7న ఈ పోర్టల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే.. ప్రారంభమైన నాటి నుంచీ పోర్టల్లో అనేక సాంకేతిక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ప్రొఫైల్ను తాజాపరచడం, పాస్వర్డ్స్ మార్చే సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు యూజర్లు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. లొపాలను తొలగించడంపై దృష్టిపెట్టాలంటూ సీఈఓ పారెఖ్ను, సంస్థలో మరో కీలక అధికారి అయిన ప్రవీన్ రావును కోరారు. ఇక.. ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని కూడా వారానికొకసారి ఆర్థికమంత్రికి పోర్టల్ సమస్యల పరిష్కారంపై అప్డేట్స్ అందిస్తున్నారు.