నిస్వార్థ పోరాటాల ఫలితమే స్వాతంత్య్రం
ABN , First Publish Date - 2020-08-15T10:19:11+05:30 IST
నిస్వార్థంగా జరిగిన పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్ర గవర్నర్ ..
తమిళిసై పంద్రాగస్టు సందేశం...
గవర్నర్ ఇచ్చే ‘ఎట్హోమ్’ రద్దు
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): నిస్వార్థంగా జరిగిన పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన త్యాగధనులను స్మరించుకోవాలని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆమె సందేశాన్ని ఇచ్చారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. దేశాన్ని మరింత సురక్షితంగా, స్వావలంబన సాధించే దిశగా మార్చాలని పిలుపునిచ్చారు.
కాగా, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్షాలు, ప్రముఖులకు గవర్నర్ ఇచ్చే ‘ఎట్హోమ్’ కార్యక్రమం తొలిసారి రద్దయింది. ఈ కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం 3 గంట ల నుంచి 5 గంటల దాకా స్వాతంత్య్ర సమరయోధులు, ఆర్మీ అధికారులు, మాజీ సైనికులు, అమరజవాన్ల కుటుంబసభ్యులు, సాహిత్యం, క్రీడలు, వైద్యం వంటి తదితర రంగాలకు చెందిన దాదాపు 35 మంది ప్రముఖులతో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు పంచుకోనున్నారు.