ఉగాది నుంచి కొత్త జిల్లాలు

ABN , First Publish Date - 2022-01-27T08:18:21+05:30 IST

రాష్ట్రంలో ఉగాది నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రకటించారు. ‘‘పాలనా సౌలభ్యం, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు జిల్లాల పునర్విభజన చేశాం. గిరిజనులకు సంబంధించి రెండు..

ఉగాది నుంచి కొత్త జిల్లాలు

  • వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు పూర్తి
  • ఇతోధికంగా నగదుబదిలీ, ఆస్తుల పంపిణీ
  • మొత్తం రూ.1.67లక్షల కోట్లమందికి లబ్ధి 
  • వేతనాల పెంపుతో 10,247 కోట్ల భారం
  • కొవిడ్‌లోనూ 23శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం
  • పింఛన్ల ద్వారా రూ.45,837కోట్లు ఖర్చు 
  • గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్‌ విశ్వభూషణ్‌

అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉగాది నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రకటించారు. ‘‘పాలనా సౌలభ్యం, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు జిల్లాల పునర్విభజన చేశాం. గిరిజనులకు సంబంధించి రెండు ప్రత్యేక జిల్లాలుంటాయి. రాష్ట్రంలో మొత్తంగా 26జిల్లాలు ఏర్పాటవుతున్నాయి’’ అని వెల్లడించారు. కొవిడ్‌లోనూ ప్రభుత్వ ఉద్యోగులకు 23శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని, దీనివల్ల రూ.10,247 కోట్ల భారం ఖజానాపై పడిందన్నారు. బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన పరేడ్‌ను తిలకించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే...


అందరికీ ఫలాలు అందుతున్నాయి..

‘‘రాష్ట్రంలో ఇప్పటివరకు వివిధ పథకాల కింద 9.29కోట్ల మంది లబ్ధిదారులకు రూ.1.67లక్షల కోట్లను నేరుగా నగదు బదిలీ కింద లబ్ధిదారులకు అందించాం. పేదల సంక్షేమం-ఉద్యోగుల సంక్షేమాన్ని సమతుల్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో 95శాతాన్ని ఇప్పటికే నెరవేర్చింది. రైతులకు వివిధ పథకాల కింద రూ.86,313 కోట్ల లబ్ధిని అందించాం. సుపరిపాలన సూచీలో వ్యవసాయ, అనుబంధరంగాల్లో ఏపీనే దేశంలో మొదటిస్థానంలో నిలిచింది. దేశం మొత్తం ఉత్పత్తి చేసే మత్స్య ఉత్పత్తుల్లో 29.67శాతం ఏపీ వాటానే. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మొత్తాన్ని రూ.10వేలకు పెంచాం. డీజిల్‌ సబ్సిడీని పెంచాం. కొత్త ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నాం. చేపల వినియోగాన్ని పెంచేందుకు 14వేల రిటైల్‌ చేపల అమ్మకం దుకాణాలను పెట్టనున్నాం’’


పిల్లల భవితకు పాస్‌పోర్టుగా విద్య

‘‘విద్య పిల్లల భవిష్యత్‌కు పాస్‌పోర్టుగా ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగానే మన బడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా రూ.3,669కోట్లు ఖర్చుచేశాం. రెండో విడత ద్వారా రూ.4,535కోట్లు ఖర్చుచేస్తున్నాం. పాఠశాలల ముఖచిత్రం మారుతోంది. ఫలితాలు కూడా కనిపిస్తున్నాయనేదానికి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య 37లక్షల నుంచి 43లక్షలకు పెరగడమే నిదర్శనం. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులుండేలా చేసేందుకు ప్రభుత్వం ఆరంచెల నూతన విద్యావిధానం అమలుచేస్తోంది. వైద్యాలయాల్లో నాడు-నేడు ద్వారా ప్రమాణాలు పెంచాం. 14,391 ఉద్యోగాలు వైద్యరంగంలో భర్తీచే సేందుకు అనుమతించాం. ఇవికాక ఇప్పటికే 24,982పోస్టులను భర్తీ చేశాం. ఆరోగ్య శ్రీ పథకాన్ని దాదాపు 95శాతం ప్రజలకు వర్తింపచేశాం’’ 


వందశాతం మొదటి డోసు ఇచ్చాం..

‘‘మూడో విడత కొవిడ్‌ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లుచేశాం. అన్నిచోట్లా తగిన ఆక్సిజన్‌ కేంద్రాలు ఏర్పాటుచేశాం. జనవరి 21నాటికి వందశాతం మందికి మొదటి డోసు పూర్తిచేశాం. 86శాతం మంది కి రెండో డోసు పూర్తిచేశాం. 15-18ఏళ్ల మధ్యనున్న పిల్లలకు 93శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు నాలుగు విడతల్లో రూ.25,517 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటికే రూ.12,758 కోట్లు రెండు విడతలుగా చెల్లించాం. మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశ బిల్లు తెచ్చాం. వైఎస్సార్‌ పింఛను కానుక ద్వారా నెలకు రూ.2,500 ఇస్తున్నాం. పింఛన్ల కోసం ఇప్పటివరకు రూ.45,837 కోట్లు ఖర్చుచేశాం’’







రాజ్యాంగ నియమాలు అమలు కావాలి : చంద్రబాబు

అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పిస్తూ, రక్షణగా నిలిచే రాజ్యాంగ నియమాలు అన్ని వేళలా అమలు కావాలి’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆకాక్షించారు. బుధవారం భారత 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉండవల్లిలోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండాకు గౌరవ వందనం చేశారు. 


గ్రామ స్వరాజ్య చిహ్నాలుగా సచివాలయాలు

‘‘పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. కడప జిల్లా కొప్పర్తిలో రూ.25వేల కోట్లతో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇం డస్ర్టియల్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమలకు ప్రో త్సాహకాలు చెల్లించాం. పోర్టులు, విమానాశ్రయా లు అభివృద్ధి చేస్తున్నాం. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద 32లక్షల ఉచిత ఇళ్ల పట్టాలు ఇచ్చాం. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.32.909 కో ట్లు ఖర్చు చేశాం. గ్రామ స్వరాజ్యానికి నిజమైన ప్రతిబింబంలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసింది.’’


సచివాలయాల శకటానికి మొదటి బహుమతి

గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మొత్తం 16శాఖల శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రదర్శించిన ‘మారుతున్న పల్లె ముఖచిత్రం’ శకటానికి మొదటి బహుమతి లభించింది.  మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖకు చెందిన ‘ఫౌండేషన్‌ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌గా అంగన్‌వాడీలు’ శకటానికి రెండో బహుమతి, వైద్య ఆరోగ్యశాఖ శకటానికి మూడో బహుమతి లభించాయి.



సత్వర న్యాయం న్యాయవ్యవస్థ బాధ్యత  

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా

ఘనంగా గణతంత్ర వేడుకలు

అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): సమాజంలోని అణగారిన వర్గాలు, సామాజికంగా వెనుకబడినవారు, పిల్లలు, వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకొని సత్వర న్యాయం అందించాల్సిన బాధ్య త న్యాయవ్యవస్థపై ఉందని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు. హైకోర్టులో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైకోర్టు భద్రతా సిబ్బంది నుంచి చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా గౌరవ వందనం స్వీకరించారు.  జాతీయ జెండాను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ మాట్లాడుతూ.... కొవిడ్‌ కారణంగా ప్రస్తుతం కోర్టు విచారణలను   వర్చువల్‌ విధానంలో జరుపుతున్నామన్నారు. మొత్తం భారత జాతి, న్యాయవ్యవస్థ కొవిడ్‌ సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్తున్నాయని చెప్పారు.


జనసేన కేంద్ర కార్యాలయంలో..

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు. 


కరోనా కట్టడిలో ప్రభుత్వ కృషి అభినందనీయం

రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కృషి

రిపబ్లిక్‌ డే వేడుకల్లో స్పీకర్‌ తమ్మినేని, మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు

అసెంబ్లీ, సచివాలయంలో మువ్వన్నెల జెండా రెపరెపలు


అమరావతి, న్యూఢిల్లీ, జనవరి 26(ఆంధ్రజ్యోతి): అమరావతి శాసన సభ, శాసనమండలి ప్రాంగణా ల్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘన ంగా జరిగాయి. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంగణాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడారు. ‘‘కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం కృషి అభినందనీయం. నేడు మన దేశం ఎదుర్కొంటున్న అంతర్గత, బహిర్గత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయి. రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోన్న తీరు అభినందనీయం’’ అని అన్నారు. మండలి చైర్మన్‌... ‘‘అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సీఎం విశేష కృషి చేస్తున్నారు’’ అని అన్నారు.


ప్రభుత్వ యంత్రాంగం ఎనలేని కృషి చేస్తోంది: సీఎస్‌

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లి సకాలంలో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం  కృషి చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ కొనియాడారు. సచివాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.


ఢిల్లీ ఏపీ భవన్‌లో...

ఆంధ్ర భవన్‌లో గణతంత్ర వేడుకలను ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనా, అదనపు కమిషనర్‌ హిమాన్షు కౌశిక్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. 



మెరుగ్గా పీఆర్సీ ఇచ్చాం.. 

‘‘పోలవరం ప్రాజెక్టు షెడ్యూల్‌ ప్రకారమే నడుస్తోంది. 2023నాటికి ప్రాజెక్టు పూర్తిచేస్తాం. పెన్నా నది మీద సంగం బ్యారేజ్‌, నెల్లూరు బ్యారేజ్‌లను ఈ ఏడాది మార్చిలో ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 54 కొత్త సాగునీటి ప్రాజెక్టులను రూ.74,920 కోట్లతో ప్రారంభించేందుకు ఆలోచిస్తోంది. ఉద్యోగులు ప్రభుత్వంలో విడదీయలేని భాగం. 27శాతం ఐఆర్‌ ఇవ్వడం ద్వారా రూ.17,265 కోట్లు...23శాతం ఫిట్‌మెంట్‌ ద్వారా రూ.10,247 కోట్లు ప్రభుత్వంపై భారం పడింది. కొవిడ్‌తో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం తగ్గినా ఉద్యోగులకు వీలైనంత మెరుగైన పీఆర్సీ ఇచ్చాం’’ 

Updated Date - 2022-01-27T08:18:21+05:30 IST