ఎమ్మెల్సీల ఫైల్‌పై సంతకం చేసిన గవర్నర్‌

ABN , First Publish Date - 2021-06-15T01:23:45+05:30 IST

ఎమ్మెల్సీల ఫైల్‌పై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ సంతకం చేశారు. మోషేన్‌ రాజు, రమేష్‌ యాదవ్‌, లేళ్ల అప్పిరెడ్డి, తోట

ఎమ్మెల్సీల ఫైల్‌పై సంతకం చేసిన గవర్నర్‌

అమరావతి: ఎమ్మెల్సీల ఫైల్‌పై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ సంతకం చేశారు. మోషేన్‌ రాజు, రమేష్‌ యాదవ్‌, లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తుల పేర్లకు క్లియరెన్స్‌ వచ్చింది. సీఎం జగన్‌తో భేటీ అనంతరం గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్‌ కేసులు న్నట్లు గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఫైల్‌ను గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారు. నామినేటెడ్‌ కోటాలో గవర్నర్‌ శాసనమండలిలో నియమించే ఎమ్మెల్సీ స్థానాలు 4 ఖాళీ అయ్యాయి. వీటి భర్తీకి జగన్‌ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 4పేర్లు.. లేళ్ల అప్పిరెడ్డి(గుంటూరు జిల్లా), తోట త్రిమూర్తులు(తూర్పుగోదావరి), మోషేన్‌ రాజు(పశ్చిమగోదావరి), రమేశ్‌ యాదవ్‌(అనంతపురం జిల్లా)తో కూడిన జాబితాను గవర్నర్‌కు పంపింది. సాధారణంగా ప్రభుత్వం నుంచివచ్చిన ఫైళ్లను ఆయన అదేరోజు ఆమోదించి పంపిస్తారు. చాలా ఫైళ్లు గంటల వ్యవధిలోనే ఆమోదంతో ప్రభుత్వానికి తిరిగి వెళ్లిపోతాయి. కానీ ఎమ్మెల్సీల నియామకం ఫైల్ వెళ్లి 4రోజులైనా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. జగన్‌ వివరణ అనంతరం గవర్నర్ ఆమోదించారు. 


ఇటీవలి కాలంలో తన ద్వారా జరిగే నియామకాల్లో గవర్నర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి ఆ మధ్య రాష్ట్రప్రభుత్వం ముగ్గురి పేర్లతో జాబితా పంపింది. అందులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌పై సర్కారు మొగ్గు చూపిందని ప్రచారం జరిగింది. కానీ గవర్నర్‌ ఆ ముగ్గురి సర్వీసుకు సంబంధించిన వార్షిక కాన్ఫిడెన్షియల్‌ రికార్డులు తెప్పించుకుని పరిశీలించారు. శామ్యూల్‌తో పాటు మరొకరి విషయంలో కొన్ని వివాదాలు ఉన్నట్లు గుర్తించి.. చివరకు మాజీ సీఎస్‌ నీలం సాహ్ని పేరును ఓకే చేశారు. ఇప్పుడు నామినేటెడ్‌ ఎమ్మెల్సీల విషయంలోనూ తన అభ్యంతరాలను తెరపైకితెచ్చారు. ఆయన మనోగతం తెలియడంతో ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు.



Updated Date - 2021-06-15T01:23:45+05:30 IST