ఏడాదిన్నర పాటు చట్టం అమలును నిలుపుతామన్న కేంద్రం.. 'నో' చెప్పిన రైతులు

ABN , First Publish Date - 2021-01-21T01:44:20+05:30 IST

నూతన సాగు చట్టాలపై కేంద్రం, రైతు ప్రతినిధుల మధ్య బుధవారం జరిగిన 10వ విడత ..

ఏడాదిన్నర పాటు చట్టం అమలును నిలుపుతామన్న కేంద్రం.. 'నో' చెప్పిన రైతులు

న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలపై కేంద్రం, రైతు ప్రతినిధుల మధ్య బుధవారం జరిగిన 10వ విడత చర్చలు ఎలాంటి సానుకూల ఫలితం రాబట్టకుండానే ముగిసాయి. చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం మంత్రుల బృందం తేల్చిచెప్పింది. అయితే, ఏడాదిన్నర పాటు చట్టం అమలును నిలిపి ఉంచేందుకు సిద్ధమని, ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనతో రైతు ప్రతినిధులు విభేదించారు. సాగు చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోవాలని పునరుద్ఘాటించారు. 


కాగా, సమావేశానంతరం రైతు ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, కోర్టులో అఫిడవిట్ సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తమకు చర్చల్లో తెలియజేసిందని, ఇందుకోసం ఏడాదిన్నర పాటు చట్టాల అమలును నిలిపి ఉంచుతామని చెప్పిందని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా వివరించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), మూడు చట్టాలపై కమిటీ వేస్తామని, కమిటీ సిఫారసులు అమలు చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పిందన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై గురువారంనాడు తాము సమావేశమై చర్చిస్తామని హన్నన్ మొల్లా తెలిపారు. కాగా, మరో రైతు ప్రతినిధి మాట్లాడుతూ, ఏడాదన్నర పాటు చట్టాలను సస్పెండ్ చేసేందుకు సిద్ధమని కేంద్ర  ప్రతినిధులు చెప్పారని, అయితే చట్టాలను సస్పెండ్ చేయడానికి ఒప్పుకునేది లేదని, చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతు ప్రతినిధులు విస్పష్టంగా చెప్పారని తెలిపారు.

Updated Date - 2021-01-21T01:44:20+05:30 IST