పార్లమెంటు ప్రతిష్టంభనకు కేంద్రమే కారణం: ఆనంద్ శర్మ

ABN , First Publish Date - 2021-07-27T20:40:02+05:30 IST

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఆరురోజులైనా ప్రతిష్టంభన కొనసాగడానికి విపక్షాలే ..

పార్లమెంటు ప్రతిష్టంభనకు కేంద్రమే కారణం: ఆనంద్ శర్మ

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఆరురోజులైనా ప్రతిష్టంభన కొనసాగడానికి విపక్షాలే  కారణమంటూ అధికార పక్షం చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. పార్లమెంటులో తలెత్తిన ప్రతిష్టంభనకు పూర్తిగా కేంద్రానిదే బాధ్యతని ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. పార్లమెంటులో అర్ధవంతమైన చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి ఎంతమాత్రం ఆసక్తి లేదని, పార్లమెంటు ద్వారా ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించడంపై ఏమాత్రం నమ్మకం లేదని అన్నారు. ప్రభుత్వ ఎజెండా కోసం మాత్రమే పార్లమెంటు జరపాలనుకోవడం సరికాదని, జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చ జరగడమే  సమావేశాల ఉద్దేశం కావాలని అన్నారు. విపక్షాలతో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. పెగాసస్ ప్రాజెక్ట్ రిపోర్టుపై చర్చ జరపి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు ఆదేశించాలన్న తమ విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించాలని అన్నారు. ప్రజాస్వామ్యం నిఘాస్వామ్యంగా మారకుండా చూసే విద్యుక్త ధర్మాన్ని విపక్షాలు పాటిస్తున్నాయని, ప్రభుత్వం మాత్రం జవాబులు ఇచ్చేందుకు సిద్ధంగా లేదని తప్పుపట్టారు. దీంతో ఆందోళన కొనసాగించడం మినహా తమకు మరో గత్యంతరం లేకుండా పోయిందని ఆనంద్ శర్మ చెప్పారు.

Updated Date - 2021-07-27T20:40:02+05:30 IST