మూడు కొత్త farm laws రద్దు...ప్రధాని మోదీ సంచలన ప్రకటన
ABN , First Publish Date - 2021-11-19T15:00:22+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం సంచలన ప్రకటన చేశారు....
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం సంచలన ప్రకటన చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకుంటామని మోదీ పేర్కొన్నారు.రైతుల ఆందోళనలతో కేంద్రం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాన ప్రకటన చేశారు.
క్షమాపణలు చెబుతున్నా...
‘‘మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం’’ అని ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు.కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఒక వర్గాన్ని ఒప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు.‘‘నేను దేశానికి క్షమాపణలు చెబుతున్నాను, స్వచ్ఛమైన హృదయంతో... మేం రైతులను వ్యవసాయ చట్టాలపై ఒప్పించలేకపోయాం. మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడానికి నేను ఇక్కడ ఉన్నాను... ఈ నెల పార్లమెంటు సమావేశాల్లో రద్దు లాంఛనాలను పూర్తి చేస్తాం’’ అని ప్రధాని మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘జో కియా కిసానో కే లియే కియా, జో కర్ రహా హున్ దేశ్ కే లియే కర్ రహా హున్ (నేను చేసింది రైతుల కోసం, నేను చేస్తున్నది దేశం కోసం)’’ అని ప్రధాని మోదీ అన్నారు.దేశంలోని పేదలు, రైతుల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను కూడా ప్రధాన మంత్రి వివరించారు. ‘‘నా ఐదు దశాబ్దాల కాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేను చూశాను... దేశం నన్ను ప్రధానమంత్రిని చేసినప్పుడు, నేను కృషి వికాస్, రైతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.