గ్రేడ్-2 సూపర్ వైజర్.. పరీక్ష, ఫలితాలపై అభ్యంతరాలు
ABN , First Publish Date - 2022-01-22T17:46:32+05:30 IST
అంగన్వాడీ కేంద్రాల్లో గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష, ఫలితాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా
కోర్టుకు వెళ్లే యోచనలో అంగన్వాడీ టీచర్లు
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కేంద్రాల్లో గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష, ఫలితాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 433 పోస్టుల భర్తీకి జనవరి 2న నిర్వహించిన పరీక్షకు 16,815 మంది హాజరయ్యారు. అయితే పరీక్ష రాసేందుకు సరిపడా సమయం ఇవ్వలేదని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫలితాలు వెల్లడించిన తర్వాత రీ కౌంటింగ్కు అధికారులు అవకాశం కల్పించలేదని మరికొందరు విమర్శిస్తున్నారు.
అంగన్వాడీ టీచర్లకు గ్రేడ్-2 సూపర్వైజర్ పదోన్నతికి నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రం సివిల్స్ స్థాయిలో రూపొందించారని ఆరోపిస్తున్నారు. సుమారు 40 పేజీల ప్రశ్నపత్రం ఇచ్చి కేవలం 90 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలనడం సరికాదని అంటున్నారు. వికలాంగులు, వితంతువులకు అదనపు మార్కులు ఇవ్వాల్సి ఉండగా అలా చేయలేదని ఆరోపిస్తున్నారు. మొత్తంగా గ్రేడ్-2 సూపర్వైజర్ పరీక్ష, ఫలితాల తీరుపై కోర్టును ఆశ్రయించేందుకు కొందరు అంగన్వాడీలు సిద్ధం అవుతున్నారు.