ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : కలెక్టర్ భారతి హొళికేరి
ABN , First Publish Date - 2020-09-17T10:31:25+05:30 IST
ఖరీఫ్ సీజన్లో రైతులు తాము పండించిన పంటను విక్రయించుకునేందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ భారతి హొళికేరి పేర్కొన్నారు
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 16 : ఖరీఫ్ సీజన్లో రైతులు తాము పండించిన పంటను విక్రయించుకునేందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ భారతి హొళికేరి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు ఇలా త్రిపాఠి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ, సహకార శాఖ, జిల్లా మార్కెటింగ్ శాఖ, జిల్లా మార్కెటింగ్ శాఖ రైస్మిల్లుల యజమానులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడారు. కొవిడ్-19 వైరస్ నియంత్రణ కొనసాగుతున్నందున జిల్లాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట విక్రయానికి అనుకూలంగా ఎక్కువగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన పంట నిల్వ, తరలింపు కోసం గన్నీ సంచులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ప్రతి కేంద్రంలో కరోనా నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రైతులు పండించిన పంటను కేంద్రాలకు తీసుకురావడానికి ముందే కల్లాల్లో నియమ నిబంధనల ప్రకారం తేమ శాతం ఉండేలా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి వీరయ్య, జిల్లా సహాయ సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి గజానంద్, కార్మిక శాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, రైస్మిల్లుల యజమానులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.