రాత్రి అయితే చాలు.. సచివాలయంలోనే..
ABN , First Publish Date - 2021-08-13T06:31:27+05:30 IST
పట్టణంలోని..
33, 34 వార్డుల సచివాలయంలో అడ్మిన్ తెంపరితనం
ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ హెచ్చరించినా మారని వైఖరి
గుడివాడ: పట్టణంలోని అల్లంబడి ప్రాంగణంలో 33, 34వ వార్డుల సచివాలయం అడ్మిన్ వైఖరి నానాటికీ వివాదాస్పదంగా తయారవుతోంది. రాత్రి అయితే చాలు సచివాలయాన్ని బార్గా మార్చేస్తున్నారు. అడ్మిన్ పాలపర్తి సత్యమనోహర్పై పలు ఫిర్యాదులు రావడంతో ఆర్డీవో జి.శ్రీనుకుమార్ గతంలో హెచ్చరించారు. తాజాగా సచివాలయంలోనే మందు పార్టీలు, విందులు చేసుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు. సచివాలయం పని వేళల తర్వాత కార్యాలయం మూసివేయాల్సి ఉండగా అక్కడే రాత్రంతా ఉంటూ గానాబజానా ఏర్పాటు చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వివిధ పనులపై వచ్చే వారికి పైసలిస్తేనే సానుకూలంగా పని చేస్తున్నారనే అపప్రద మూటకట్టుకున్నారు. సాక్షాత్తూ అడ్మిన్ సమయపాలన పాటించకపోవడంతో మిగతా కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. కార్యదర్శుల వద్ద సాయంత్రానికి వసూళ్లు చేసి రాత్రివేళల్లో పార్టీలు నిర్వహించుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ను వివరణ కోరగా ఈ అడ్మిన్పై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.