మహాపాదయాత్రకు అడుగడుగునా ఘనస్వాగతం
ABN , First Publish Date - 2021-11-28T05:42:49+05:30 IST
అమరావతి పరరిక్షణ సమితి చేపట్టిన మహా పాదయాత్రకు నగర ప్రజలు జోరువానలో పూలవర్షం కురిపిస్తూ సంఘీభావం ప్రకటించారు.
నెల్లూరు (సాంస్కృతికం), నవంబరు 27 : అమరావతి పరరిక్షణ సమితి చేపట్టిన మహా పాదయాత్రకు నగర ప్రజలు జోరువానలో పూలవర్షం కురిపిస్తూ సంఘీభావం ప్రకటించారు. పోలీసు ఆంక్షల నడుమ అడపాదడపా ఆటంకాలు ఏర్పడ్డా రైతులు తమ సంకల్పం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని కావాలంటూ ముందుకు సాగారు. జెట్టి శేషారెడ్డి భనవం నుంచి శనివారం ఉదయం ప్రారంభమైన ఈ యాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రాంతాలలో సాగింది. అపోలో ఆసుపత్రి నుంచి, చిల్డ్రన్స్ పార్కు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, బెజవాడ గోపాల్రెడ్డి విగ్రహం కూడలి, కేవీఆర్ పెట్రోలు బంకు సెంటర్కి చేరింది. డీకేడబ్ల్యూ కళాశాల మీదుగా మధ్యాహ్నం బారాషహీద్ దర్గాకు చేరుకున్న రైతులు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. భోజనాలు అనంతరం పొదలకూరురోడ్డు సెంటర్, సారాయిఅంగడి సెంటర్, పద్మావతిసెంటర్, వాటర్ ట్యాంకు, నిప్పో సెంటర్, డైక్సరోడ్డు సెంటర్, తెలుగుగంగ కాలనీ, కావేరినగర్, రామకోటయ్యనగర్ మీదుగా సాయంత్ర కొత్తూరు సెంటర్కు పాదయాత్ర చేరింది. ప్రధాన కూడళ్లు, రోడ్లపైన అన్ని వర్గాలప్రజలు పూలవర్షం కురిపించారు.
యువనేత రూ.లక్ష విరాళం
నెల్లూరు (వైద్యం) : అమరావతి రైతుల పాదయాత్రకు యువనేత కోటంరెడ్డి ప్రజయ్సేనా రెడ్డి లక్ష రూపాయలు విరాళం అందించారు. బారా షహీద్ దర్గా వద్ద టీడీపీ నగర ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు కుమారుడు కోటంరెడ్డి ప్రజయ్సేనారెడ్డి అమరావతి జేఏసీ కన్వీనర్ తిరుపతి రాజుకు ఈ విరాళం అందించారు.
న్యాయవాదుల సంఘీభావం
నెల్లూరు (లీగల్) : అమరావతి రైతులను శనివారం నెల్లూరు నగరంలో న్యాయవాదులు కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. పాదయాత్రకు మద్దతుగా న్యాయవాదులు ప్రదర్శనగా వెళ్లి వారిని జెట్టి శేషారెడ్డి భవనం దగ్గర కలిసి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కూనిశెట్టి శ్రీధర్, దాసు గురుకుమార్, ఎస్. అంకయ్య, షేక్. నన్నేసాహెబ్, ఎస్కే. రియాజ్, కొండయ్య, డీ. దమరేశ్వర్, దామా ప్రభాకర్, సీహెచ్. శ్రీహరినారాయణరావు, గోళ్ల బాలసుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.