ఇంట్లోనే హత్యకు గురైన వృద్ధురాలు.. కుటుంబ సభ్యులకు డౌట్.. పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ మనవరాలి ‘ప్రేమ’నాటకం..!

ABN , First Publish Date - 2021-11-19T02:17:04+05:30 IST

జార్ఖండ్‌లో మనవరాలే వృద్ధురాలి పాలిట మృత్యుపాశంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. ఇంట్లోనే వృద్ధురాలు హత్యకు గురవడంతో అందరికీ అనుమానం కలిగింది.

ఇంట్లోనే హత్యకు గురైన వృద్ధురాలు.. కుటుంబ సభ్యులకు డౌట్.. పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ మనవరాలి ‘ప్రేమ’నాటకం..!

రానురాను మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. నగల కోసమో లేక నగదు కోసమే, ఆస్తుల కోసమో సొంతవారిని కూడా హత్యలు చేసే మనుషులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. జార్ఖండ్‌లో మనవరాలే వృద్ధురాలి పాలిట మృత్యుపాశంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. ఇంట్లోనే వృద్ధురాలు హత్యకు గురవడంతో అందరికీ అనుమానం కలిగింది. ఎట్టకేలకు పోలీసుల రంగప్రవేశంతో మనువరాలి నాటకం బయటపడింది. ఆ హత్యకు మనవరాలి ప్రేమ నాటకానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా... వివరాల్లోకి వెళితే..


జార్ఖండ్‌లోని డియోఘర్‌ పోఖ్‌నటిలా నివాసం ఉంటున్న ఓ బాలికకు గ్రామంలో యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. పెద్దలకు తెలీకుండా సీక్రెట్‌గా కలుసుకుంటూ వచ్చేవారు. ఓ రోజు ఇద్దరూ కలిసి ఉండగా.. బాలిక అమ్మమ్మ కంటపడ్డారు. దీంతో వారిని ఆమె మందలించింది. ఇంట్లో పెద్దలకు ఈ విషయం చెబుతుందేమోనని ఇద్దరూ భయపడ్డారు. దీంతో అప్పటినుంచి ఆమెపై పగ పెంచుకున్నారు.  ఈ నెల 16వ తేదీన కుటుంబ సభ్యులంతా పని మీద వేరే ఊరికి వెళ్లారు. వృద్ధురాలు ఒక్కటే ఇంట్లో ఉంది. ఇదే సమయం అనుకుని.. ప్రియుడు పింకు కుమార్ యాదవ్‌ను రమ్మని పిలిచింది.


ప్రియుడు లోపలికి రాగానే వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి.. తన అమ్మమ్మను హత్య చేసి, పారిపోయినట్లుగా బాలిక నమ్మబలికింది. అయితే కుటుంబ సభ్యులతో పాటూ పోలీసులకు కూడా అనుమానం రావడంతో బాలికను లోతుగా విచారించారు. చివరకు నేరం అంగీకరించింది. తమకు అడ్డుగా ఉందనే కారణంతోనే వ‌ృద్ధురాలిని హత్య చేసినట్లు ఒప్పుకొన్నారు. దీంతో బాలిక, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-11-19T02:17:04+05:30 IST