HYD : గుట్కా నమలొద్దన్నందుకు నానమ్మను చంపేశాడు!

ABN , First Publish Date - 2021-10-22T17:49:12+05:30 IST

‘చెడు వ్యసనాలు మానేసి బుద్ధిగా మసులుకో’ అని సుద్దులు...

HYD : గుట్కా నమలొద్దన్నందుకు నానమ్మను చంపేశాడు!

  • చెడు వ్యసనాలు మానమన్నందుకు..
  • నానమ్మను హత్య చేసిన మనుమడు

హైదరాబాద్ సిటీ/ఏఎస్‌రావునగర్‌ : ఈ నెల 16న కుషాయిగూడ శ్రీ కృష్ణనగర్‌ కాలనీలో హత్యకు గురైన మహిళ కేసును పోలీసులు చేధించారు. ‘చెడు వ్యసనాలు మానేసి బుద్ధిగా మసులుకో’ అని సుద్దులు చెప్పినందుకు మనుమడే ఆమెను  చంపేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి... చక్రీపురం కటింగ్‌ కాలనీకి చెందిన పనవాల లలిత (55) ఈ నెల 16న శ్రీ కృష్ణనగర్‌ కాలనీలో నివాసం ఉండే సోదరి కుమారుడు టైలర్‌ శంకర్‌ ఇంటికి చుట్టపు చూపుగా వెళ్లింది. కొద్ది సేపటి అనంతరం శంకర్‌ అతడి భార్య ఇందిరతో కలిసి చక్రీపురం చౌరస్తాలో ఉన్న టైలర్‌ షాపునకు వెళ్లారు. ఆ సమయంలో లలిత ఒంటరిగా ఇంట్లో ఉన్నారు. శంకర్‌ కుమారుడు అర్జున్‌ (24) తల్లి ఇందిర వద్ద రూ.100 తీసుకుని మధ్యాహ్న సమయంలో శ్రీ కృష్ణనగర్‌లోని ఇంటికి వచ్చాడు. 


లలిత మనుమడు ఇంటికి రాగానే యోగక్షేమాలు అడిగి ‘ఇప్పటికే నీ మానసిక స్థితి బాగాలేదు. గుట్కానమలడం లాంటి చెడు వ్యవసనాలు మాను’ అని చెప్పింది. ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన అర్జున్‌ బండరాయితో లలిత ముఖంపై బలంగా దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన లలిత అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. భయాందోళనకు గురైన అర్జున్‌ తండ్రి ద్విచక్రవాహనం తీసుకుని పారిపోయాడు. మధ్యాహ్నం భోజనం కోసం శంకర్‌, ఇందిర దంపతులు ఇంటికి రాగా సోఫాలో లలిత రక్తపు మడుగులో పడి ఉంది. 


అప్పటికే మృతి చెంది ఉండడంతో స్థానికుల సహాయంతో కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపట్టారు. అర్జున్‌ కనిపించకపోవడంతో అతడిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు అర్జున్‌ కోసం గాలింపు చేపట్టారు. గురువారం చక్రీపురంలో చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న అర్జున్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ యాదవ్‌ తెలిపారు. 

Updated Date - 2021-10-22T17:49:12+05:30 IST