గ్రాన్యూల్స్ ఇండియా లాభం రూ.164 కోట్లు
ABN , First Publish Date - 2020-10-21T09:14:14+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గ్రాన్యూల్స్ ఇండియా రెండో మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ ..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గ్రాన్యూల్స్ ఇండియా రెండో మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 25 పైసల (25ు) మధ్యంతర డివిడెండ్ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. డివిడెండ్ చెల్లింపునకు అక్టోబరు 30ని రికార్డు తేదీగా నిర్ణయించింది. కాగా సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ.163.63 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.95.79 కోట్లతో పోలిస్తే దాదాపు 70 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం కూడా రూ.708.2 కోట్ల నుంచి రూ.861.34 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 22.7 శాతం పెరిగి రూ.858 కోట్లకు చేరినట్లు గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరుసగా రెండో త్రైమాసికంలో కూడా కంపెనీ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించిందన్నారు. అంచనాల కంటే ఆదాయం, లాభాలు పెరిగాయని చెప్పారు.