గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఆపాలి
ABN , First Publish Date - 2021-08-04T05:10:41+05:30 IST
మండలంలోని పెనుబల్లి, జొన్నవాడ గ్రామాల మధ్య ఉన్న తిప్పపై జరుపుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలను వెంటనే ఆపాలంటూ సీపీఎం సీనియర్ నాయకుడు గండవరపు శ్రీనివాసులు డిమాండ్ చేశారు
తహసీల్దారు కార్యాలయం వద్ద సీపీఎం నిరసన
బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 3: మండలంలోని పెనుబల్లి, జొన్నవాడ గ్రామాల మధ్య ఉన్న తిప్పపై జరుపుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలను వెంటనే ఆపాలంటూ సీపీఎం సీనియర్ నాయకుడు గండవరపు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పెనుబల్లి, జొన్నవాడ గ్రామాల ప్రజలు, సీపీఎం, సీఐటీయూ నాయకులు తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తిప్పపైన అక్రమ గ్రావెల్ తవ్వకాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న తిప్పను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గండవరపు శ్రీనివాసులు మాట్లాడుతూ అనుమతికి మించిన తవ్వకాలపై పరిశీలించి, గండిపడిన ప్రభుత్వాదాయానికి బాధ్యుల నుంచి నగదు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు జానీబాషా, తంబి రమణయ్య, నన్నం మాధవ, కందికట్టు వెంకట రమణయ్య రెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
గ్రావెల్ తవ్వకాలు నిలిపివేత: ‘పెనుబల్లి తిప్పపై గ్రావెల్ అక్రమ తవ్వకాలు’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ మేరకు స్పందించిన తహసీల్దారు హమీద్ పెనుబల్లి తిప్పమీద జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలను మంగళవారం ఉదయం నిలిపి వేసినట్లు తెలిపారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.