కంకర వేశారు.. రోలింగ్ మరిచారు
ABN , First Publish Date - 2021-04-14T05:25:18+05:30 IST
మండల పరిధిలోని తుర్కపల్లి సమీపంలో పురాతన వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల రూ.కోటితో కొత్త వంతెనను నిర్మించారు.
నారాయణఖేడ్, ఏప్రిల్ 13: మండల పరిధిలోని తుర్కపల్లి సమీపంలో పురాతన వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల రూ.కోటితో కొత్త వంతెనను నిర్మించారు. వంతెనకు ఇరువైపులా నెల రోజుల క్రితం దాదాపు అరకిలోమీటరు వరకు కంకర వేసినప్పటికీ, రోడ్డు రోలర్తో రోలింగ్ చేయించకుండా వదిలేశారు. దీంతో ఈ ప్రాంతం గుండా వెళ్లే వారు ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రమాదం బారిన పడుతున్నారు. ద్విచక్రవాహన దారులు మరీ ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద వాహనాలు రాకపోకలు సాగిస్తున్న సమయంలో దుమ్ము ఎగిసి పడుతూ వెనుకవచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఖేడ్ నుంచి సిర్గాపూర్, కల్హేర్ మండలాలతో పాటు పొరుగున్న ఉన్న కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఈ రోడ్డు గుండా ప్రతి రోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా తాము నరకం అనుభవిస్తున్నామని పలువురు వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై వేసిన కంకరను రోలర్తో తొక్కించి ప్రమాదాలు జరుగకుండా చూడాలని వారు కోరుతున్నారు.