నాసా, స్పేస్ఎక్స్ లాంచ్పై ఇస్రో ప్రశంసలు.. చారిత్రాత్మకమంటూ ట్వీట్
ABN , First Publish Date - 2020-06-01T22:10:43+05:30 IST
స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన రాకెట్లో నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు
న్యూఢిల్లీ: స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ మిషన్పై భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) అభినందనలు తెలిపింది. స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన రాకెట్లో నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు ఆదివారం విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) చేరుకున్నారు. అమెరికాలో దాదాపు దశాబ్దం తరువాత చేపట్టిన ఈ లాంచ్ చారిత్రాత్మకమంటూ ఇస్రో ట్వీట్ చేసింది. మే 30వ తేదీన ఫ్లోరిడాలోని కెన్నెడి స్పేస్ సెంటర్ నుంచి వ్యోమగాములు బాబ్ బెన్కెన్, డౌగ్ హర్లే స్పేస్ఎక్స్ రాకెట్లో కక్ష్యలోకి ప్రవేశించారు. మొట్టమొదటిసారి ఒక ప్రైవేటు స్పేస్ కంపెనీతో కలిసి నాసా ఈ మిషన్ను చేపట్టడం విశేషం. మరోపక్క మనుషులను అంతరిక్షంలోకి పంపిన మొదటి ప్రైవేటు సంస్థగా స్పేస్ఎక్స్ చరిత్ర సృష్టించింది. 19 గంటల పాటు ప్రయాణం చేసిన వ్యోమగాములు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అమెరికాకు చెందిన వ్యోమగామి క్రిస్ కాసిడి, రష్యాకు చెందిన వ్యోమగాములు అనాటొలి ఇవానిషిన్, ఇవాన్ వాగ్నర్ ఇద్దరు వ్యోమగాములకు స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా.. భారత్ కూడా ‘గగన్యాన్’ పేరుతో మొట్టమొదటి స్పేస్ మిషన్కు సిద్దమవుతోంది. రూ. 10 వేల కోట్ల భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ను మహాత్మాగాంధీ 75వ పుట్టినరోజు సందర్భంగా 2022లో లాంచ్ చేయనున్నారు. ఈ మిషన్లో నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్లు పాల్గొనబోతున్నారు. ఇప్పటికే వీరు మాస్కోలో ట్రైనింగ్ పొందుతున్నారు.