ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు
ABN , First Publish Date - 2021-04-13T05:30:00+05:30 IST
జిల్లాలో ఉగాది పర్వదినవేడుకలు మంగళవారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
జిల్లాలో ఉగాది పర్వదినవేడుకలు మంగళవారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి, పచ్చడి సేవించి, పంచాంగ శ్రవణం చేశారు. రైతులు వ్యవసాయక్షేత్రాల్లో పూజలు చేశారు. ఖానాపూర్లో చిన్నారుల మెడలో కుడుకల పేర్లను వేసి ఆనందించారు.
ఖానాపూర్, ఏప్రిల్ 13 : మండల కేంద్రంలో ఉగాది పర్వదిన వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని తెల్లవారు జామునే నిద్రలేచి తమ తమ వ్యవసాయ క్షేత్రాల్లో నూతన పనులను ఆరంబించేందుకు అన్నదాతలు తరలివెళ్లారు. కుటుంబ సమేతంగా వెళ్లి వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. చిన్నారులకు కుడుకల పేర్లు వేసి సంబురాలు చేసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బయటకు వెళ్ళకుండా తమ తమ ఇళ్ళలోనే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చళ్లు, రకరకాల వంటకాలు తయారు చేసుకుని కుటుంబంతో సంతోషంగా గడిపారు. మరికొంత మంది తమ సమీపంలోని ఆలయాలకు వెళ్లి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా పలువురు తమ ఇళ్ల ముందు కాషాయధ్వజం ఎగురవేశారు.
ఉగాది పురస్కారాలు అందజేత
నిర్మల్ కల్చరల్, ఏప్రిల్ 13 : ఉగాది ఉత్సవసమితి ఆధ్వర్యంలో మంగళ వారం పెన్షనర్ల సంఘ భవనంలో ఉగాది పురస్కారాలు అందజేశారు. అంతకు ముందు చక్రపాణి నరసింహమూర్తి పంచాంగ పఠనం చేసి యజ్ఞం నిర్వహిం చారు. అశోక్పండిత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పురస్కారాలు అందిం చారు. డాక్టర్ వేణుగోపాలకృష్ణ, రావుల రాంనాథ్, డాక్టర్ కిరణ్, కృష్ణవేణి, చక్రపాణి నరసింహమూర్తి, రాంరమేష్ పురస్కారాలు అందుకున్నారు. ఉత్సవ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం నారాయణగౌడ్ మాట్లాడుతూ గత పన్నెడు ఏళ్లుగా పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు.
గండిరామన్న ఆలయంలో ఉగాది వేడుకలు
నిర్మల్ కల్చరల్, ఏప్రిల్ 13 : శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం రోజున శ్రీ గండిరామన్న దత్తసాయి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం పూజారి అనురాగ్శర్మచే పంచాంగ శ్రవణం, అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిపంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో గండి రామన్న దత్తసాయి ఆలయసింగిల్ ట్రస్ట్ చైర్మన్ లక్కిడి జగన్మోహన్ రెడ్డి, గోపాల్రెడ్డి, నందు, సందీప్, లింగమయ్య, భక్తులు పాల్గొన్నారు.
ఖరీఫ్సాగుకు శ్రీకారం
దిలావర్పూర్, ఏప్రిల్ 13 : ప్లవనామ సంవత్సరం ఉగాది పండుగను మండలంలో ఘనంగా జరుపుకున్నారు. పల్లె ముంగిళ్లు మామిడాకుల తోరణా లతో కొత్తశోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే రైతులు అరక లతో పంటచేలకు బయలుదేరారు. భూమాతకు ప్రత్యేకపూజలు చేసి ఖరీఫ్ సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ యేడాదైనా కలిసిరావాలని ప్రకృతిమాతను మొక్కుకున్నారు. అక్కడే అంబలి, పెరుగన్నం ఆరగించారు.
కదిలిలో పంచాంగ శ్రవణం
శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని మంగళవారం శ్రీమాతాన్నపూర్ణ కదిలి పాపహేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. దేవస్థానం అర్చకులు శంకర్స్వామి ద్వారా పంచాంగ శ్రవణం చేశారు. భక్తులకు ఉగాదిపచ్చడిని పంచిపెట్టారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ భుజంగ్రావు పాటిల్, ధర్మకర్తలు సాయినాథ్, భక్తులు పాల్గొన్నారు. కాగా భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా దేవస్థానం పాలకవర్గం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మాస్క్లను ధరించిన భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించారు. భౌతికదూరం పాటిస్తూ భక్తులు పాప హరేశ్వరస్వామిని, మాతాన్నపూర్ణేశ్వరి దేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
బాసర అమ్మవారి సన్నిధిలో ఉగాది వేడుకలు
బాసర, ఏప్రిల్ 13 : బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయమే మహారాష్ట్ర సాంప్ర దాయ పద్దతిలో పండితులు ఉగాది వేడుకల పూజలను జరిపారు. అమ్మవారి ఆలయ ప్రధానప్రాంగణంలో దాదాపు రెండు గంటల పాటు ఆలయ పండి తులు వివిధ పూజలు నిర్వహించారు. కొవిడ్ కారణంగా పంచాంగ శ్రవణం భక్తులు లేకుండానే జరిపారు. కొవిడ్ కారణంగా తెలుగు సంవత్సర తొలిరోజు భక్తులు లేక కళతప్పింది. తక్కువసంఖ్యలో భక్తులు అందులో స్థానికులే ఎక్కువ మంది తెలుగు నూతన సంవత్సర తొలిరోజును పురస్కరించుకొని అమ్మవారిని దర్శించున్నారు. నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్ అమ్మవారిని దర్శిం చుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సోన్, ఏప్రిల్ 13 : మండలంలోని ఆయా గ్రామాల్లో ఉగాది పండగ వేడుక లను ఘనంగా జరుపుకున్నారు. శ్రీ ప్లవనామ సంవత్సరం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉగాది పచ్చడిని తాగి ఒకరికొకరు శుభా కాంక్షలు తెలుపుకున్నారు. రైతులు నూతన పంచాంగ శ్రవణంను తెలుసుకొని వ్యవసాయ నూతన పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయం నుండి ఆలయాలు భక్తుల రద్దీతో కలకలలాడాయి.
నర్సాపూర్(జి), ఏప్రిల్ 13 : మండల కేంద్రంతో పాటు గొల్లమాడ, టెంబూర్ణి,డొంగుర్ గాం, తురాటి, చాక్పల్లి, రాంపూర్తో పాటు ఆయా గ్రామాలలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయాలలో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని హనుమాన్ మందిరంలో జెండా ఆవిష్కరణ చేశారు. వేద పండితులు నరహరిశర్మ నూతన పంచాంగం చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ ప్రెసిడెంట్ బర్కుంట నరేందర్, నరేష్, గంగారాం, గ్రామస్దులు పాల్గొన్నారు.
సారంగాపూర్, ఏప్రిల్ 13 : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో మంగళవారం ఉగాది పండగను పురస్కరించుకొని మహిళలు ముఖద్వారాలకు పచ్చతోరణాలను కట్టి గ్రామాలలోని దేవాలయంలో పూజలు చేశారు. అలాగే అడెల్లి దేవాలయంలో ఏడాది పాటు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులను మొక్కారు. సాయంత్రం కౌట్ల(బి)లో గల హనుమాన్ మందిరంలో వేద పండి తులు నూతన పంచాంగాన్ని గ్రామస్థులకు చదివి వినిపించారు.
నిరాడంబరంగా వేడుకలు
ముథోల్, ఏప్రిల్ 13 : మండల కేంద్రమైన ముథోల్తో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ప్రజలు మంగళవారం ఉగాది వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు.
తానూర్ , ఏప్రిల్ 13 : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రైతులు తమ తమ వ్యవసాయ క్షేత్రాల్లో పూజలు నిర్వహించి నూతన పనులకు శ్రీకారం చుట్టారు.
కుభీర్, ఏప్రిల్ 13 : మండల కేంద్రం కుభీర్తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం గ్రామస్తులు ఉగాది పండుగను ఘనంగా నిర్వ హించుకున్నారు.