గందరగోళంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
ABN , First Publish Date - 2021-04-16T06:43:22+05:30 IST
గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు
సైదాబాద్, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్యలో వ్యత్యాసం ప్రజల్లో అయోమయానికి దారితీస్తోంది. కేవలం ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట జోన్ల పరిధిలోని కరోనా పరీక్షా కేంద్రాల్లో చేసున్న రాపిడ్ టెస్టులలో నిత్యం సుమారు 300 పైగా పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అవుతున్నాయి. కానీ రోజు జీహెచ్ఎంసీ పరిధిలో 300- 400 కేసుల వస్తున్నట్లు ప్రభుత్వం మెడికల్ బులెటిన్లో ప్రకటిస్తున్నది. ఒక ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట, సరూర్నగర్, హయత్నగర్ పరిసరాలలోనే యూపీహెచ్సీ, ప్రభుత్వ ఆస్పత్రులలో మాత్రమే నిత్యం 300 కేసు లు దాటుతుండగా, గ్రేటర్పరిధిలో మొత్తం కలిపి 300-400 మాత్రమే కేసు లు అని ప్రకటించడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. వైరస్ సోకిన వారు నిర్లక్ష్యంగా బయ ట తిరగకుండా చూడాల్సిన బాధ్యత యం త్రాంగానిదే. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలు, కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల సహాయం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
హాట్ స్పాట్ లేవీ...?
మలక్పేట, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, పాతబస్తీ పరిసరాలలో పాజిటివ్ కేసులు నిత్యం వందలాది నమోదవుతున్నా.. హట్స్పాట్లను గుర్తించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ ప్రాంతాలలో ముఖ్యంగా మురికివాడలు, బస్తీలు చాలా ఉన్నాయి. మార్కెట్లు, హోటళ్లు, బార్లు, వైన్స్, బస్సులు, ఆటోలు ఇలా ఎక్కడా చూసిన కరోనా నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. మాస్కులు ధరించకపోయినా పట్టించుకోవడం లేదు. కరోనా కట్టడికి ఏకైక మార్గంగా హాట్స్పాట్లను గుర్తించాల్సిన అవసరం ఉంది.