ఒక్క దెబ్బకు గ్రేటర్లో అనూహ్య ఫలితాలు..
ABN , First Publish Date - 2020-12-05T15:07:22+05:30 IST
ఒక్క దెబ్బకు అన్నట్టుగా గ్రేటర్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి...
- ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, బంధువుల ఓటమి
- పలు డివిజన్లలో టీఆర్ఎస్కు భంగపాటు
- సిట్టింగ్లే అధికం
- అంచనా లేకుండా బరిలోకి.. ఊహించని విజయం
హైదరాబాద్ : ఒక్క దెబ్బకు అన్నట్టుగా గ్రేటర్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కమలం జోరుతో పలు ప్రాంతాల్లోని టీఆర్ఎస్ కీలక నేతలు, వారి బంధువులు పరాజితులయ్యారు. వరుసగా రెండు, మూడు పర్యాయాలు విజేతలుగా నిలిచిన వారూ ప్రతికూల ఫలితాలు ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో 10 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన వారూ ప్రస్తుతం ఓటమి చవిచూశారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ నియోజకవర్గంలోని రాంగోపాల్పేటలో ఆయన బంధువు, సిటింగ్ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ ఓడిపోయారు. కవాడిగూడలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు పద్మ, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభా్షరెడ్డి సతీమణి భేతి స్వర్ణ పరాజయం పాలయ్యారు. మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివా్సరెడ్డి రాంనగర్లో ఓడిపోయారు. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థులు తమకు ఎదురులేదనుకున్న వారిని మట్టి కరిపించారు.
- అమీర్పేట్ సిట్టింగ్ కార్పొరేటర్, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న శేషుకుమారి(టీఆర్ఎస్), సమీప ప్రత్యర్థి సరళ(బీజేపీ) చేతిలో,1300పై చిలుకు ఓట్లతేడాతో ఓడిపోయారు.
- సినీప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగిన జూబ్లీహిల్స్ సిట్టింగ్ కార్పొరేటర్, టీఆర్ఎస్ అభ్యర్థి కాజా సూర్యనారాయణ సమీప ప్రత్యర్థి వెంకటేశ్(బీజేపీ) చేతిలో ఓటమిని చవిచూశారు.
- ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి రామ్మోహన్గౌడ్ సతీమణి, బీఎన్రెడ్డి నగర్ సిట్టింగ్ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్న ఓటమి చవిచూశారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి లచ్చిరెడ్డి గెలుపొందారు.
- గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ తమ్ముడు కూన శ్రీనివా్సగౌస్ టీఆర్ఎస్ అభ్యర్థి రావుల శేషగిరి చేతిలో ఓటమి చవిచూశారు.
- రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్, మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు వి.శ్రీనివా్సగౌడ్, బీజేపీ అభ్యర్థి రవిచారి చేతిలో 500 పైచిలుకు ఓట్లతేడాతో ఓడిపోయారు.
- జియాగూడ డివిజన్ టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ మిత్రకృష్ణ, బీజేపీ అభ్యర్థి దర్శన్ చేతిలో ఓటమి చవిచూశారు. మిత్రకృష్ణ మూడుసార్లు కార్పొరేటర్గా సేవలందించారు.
- గుడిమల్కాపూర్ డివిజన్ టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ బంగారు ప్రకాశ్, బీజేపీ అభ్యర్థి, హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సమీప బంధువు కరుణాకర్ చేతిలో ఆరువేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.