గ్రేటర్‌ దడ!

ABN , First Publish Date - 2020-11-29T06:17:27+05:30 IST

రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతున్నదన్న సమాచారం తమ వద్ద ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించగా...

గ్రేటర్‌ దడ!

నిజానికి రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలలో ఉచిత మంచినీటి హామీ మినహా మిగతా హామీలేవీ ప్రజల చెవికి ఎక్కడం లేదు. వరద సాయం కింద 25 వేలు, 50 వేలు అన్న వేలంపాటను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలలో ఒకటి రెండు మాత్రమే ప్రజలను ఆకర్షిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు అన్న హామీని మాత్రమే ప్రజలు పట్టించుకున్నారు. నవరత్నాలలో ఏమేమి ఉన్నాయో తెలియకపోయినా కూడా ఆ పదానికి ప్రజలు ఆకర్షితులయ్యారు. తెలంగాణలో కూడా రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చాయి. ప్రజలు అవేవీ పట్టించుకోలేదు. ఎన్నికల హామీలపై ప్రజలకు నిజంగానే నమ్మకం కలిగితే గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచేది. పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏ హామీ ఇవ్వకపోయినా నాలుగు సీట్లు గెలుచుకోలేదా? గ్రేటర్‌ ఎన్నికలలో ఇప్పుడు జరగబోయేది కూడా ఇదే.


తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి, నేటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల దాడికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఆత్మరక్షణలో పడిపోతూ వచ్చాయి. ఇప్పుడు మొదటిసారిగా ప్రతిపక్షాల నుంచి, ముఖ్యంగా బీజేపీ నాయకులు చేస్తున్న ఎదురుదాడితో కేసీఆర్‌ ఆత్మరక్షణలో పడిపోతున్నట్టు అనిపిస్తోంది. నిజానికి గ్రేటర్‌ ఎన్నికల్లో పీఠం దక్కించుకోవడం బీజేపీ కంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఎక్కువ అవసరం. గత ఎన్నికల్లో కేవలం 4 డివిజన్లను మాత్రమే గెలుచుకున్న బీజేపీ, ఇప్పుడు అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే తాము బలపడ్డామన్న సంతృప్తి కమలదళానికి దక్కుతుంది. గత ఎన్నికల్లో 99 సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు అంతకంటే తక్కువ సంఖ్యలో గెలిస్తే కేసీఆర్‌ పనైపోయిందన్న భావన ప్రజల్లో ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ తురుపు ముక్కగా మతకలహాల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఈ ప్రకటన వర్కవుట్‌ అవుతుందా? బెడిసికొడుతుందా? అన్నది డిసెంబర్‌ నాలుగో తేదీన గానీ తేలదు. ప్రస్తుతం కేసీఆర్‌కు ఏదీ కలిసిరావడం లేదు. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత అయినా పరిస్థితి మారుతుందా?


రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతున్నదన్న సమాచారం తమ వద్ద ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించగా, ఆ వెంటనే రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేష్‌ భగవత్‌ కూడా విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి ‘‘ఔను, కుట్రదారుల సమాచారం మాకు తెలుసు’’ అని ప్రకటించారు. ఆధునిక హైదరాబాద్‌ అభివృద్ధి చెందకముందు, అంటే పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌ మత కల్లోలాలకు చిరునామాగా ఉండేది. హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందేకొద్దీ మత కల్లోలాలకు తావు లేకుండా పోయింది. దీంతో ఈ తరం యువతకు మతకలహాలు జరిగిన నాటి భయంకర పరిస్ధితులు తెలియవు. ఇప్పుడు బల్దియా ఎన్నికల పుణ్యమా అని మళ్లీ ఇంత కాలానికి మతకలహాల ప్రస్తావన వచ్చింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అత్యున్నత స్థాయి పోలీస్‌ అధికారులు సైతం మతకలహాలకు కుట్ర జరుగుతోందన్న కచ్చితమైన సమాచారం తమ వద్ద ఉందని చెప్పడంతో సహజంగానే ఆందోళన కలుగుతుంది. జనం మరచిపోయిన మత కలహాల ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది? కుట్రదారులకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని చెబుతున్న పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చే నెల 1వ తేదీన జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి గట్టి పోటీ ఎదురవ్వడం వల్లనే మతకలహాల అంశం తెరపైకి వచ్చిందన్న విషయం చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు.


తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి, నేటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల దాడికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఆత్మరక్షణలో పడిపోతూ వచ్చాయి. ఇప్పుడు మొదటిసారిగా ప్రతిపక్షాల నుంచి, ముఖ్యంగా బీజేపీ నాయకులు చేస్తున్న ఎదురుదాడితో కేసీఆర్‌ ఆత్మరక్షణలో పడిపోతున్నట్టు అనిపిస్తోంది. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు మంత్రి కేటీఆర్‌ మొదటిసారిగా మత కలహాల విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరిగిపోవడం, బీజేపీ అభ్యర్థి రఘునందనరావు అనూహ్యంగా విజయం సాధించడాన్ని మనం చూశాం. దుబ్బాక విజయంతో జోష్‌ మీద ఉన్న బీజేపీ ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి సవాలు విసురుతోంది. దీంతో బీజేపీ నుంచి ఎదురవుతున్న ముప్పును గ్రహించిన టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా రంగంలోకి దిగారు. గ్రేటర్‌ ఎన్నికల కోసం కేసీఆర్‌ స్వయంగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. అంతటితో ఆగకుండా ప్రశాంతంగా ఉంటున్న విశ్వనగరంలో మతకల్లోలాలు సృష్టించడానికి కుట్ర జరుగుతోందంటూ బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేశారు.


ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ ఒక రాజకీయ పార్టీ నాయకుడు కూడా కనుక ఆయన చేసిన ప్రకటనను నమ్మేవాళ్లు నమ్ముతారు. నమ్మని వాళ్లు నమ్మరు. కాకపోతే ముఖ్యమంత్రి ప్రకటనను నలుగురు పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించడమే ఆశ్చర్యంగా ఉంది. పోలీసు ఉన్నతాధికారులు చేసిన ఈ ప్రకటనతో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడటం సహజం. ఫలితంగా దాని ప్రభావం పోలింగ్‌ పైన కూడా పడే అవకాశం ఉంటుంది. అయితే మత కలహాల గురించి మరిచిపోయిన గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలపై అటు ముఖ్యమంత్రి, ఇటు పోలీసు అధికారులు చేసిన ప్రకటన పెద్దగా ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. రాజకీయ క్రీడలో భాగంగానే ఇటువంటి ప్రకటనలు వస్తున్నాయని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. దీంతో ఎప్పుడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంటే అటు ప్రభుత్వాలు, ఇటు పోలీసు అధికారులు పౌరులను అప్రమత్తం చేయడానికి చేసే ప్రకటనలు ‘‘నాన్నా పులి వచ్చె’’ సామెతను గుర్తుచేసే ప్రమాదం లేకపోలేదు. శాంతిభద్రతలకు సంబంధించి ప్రజలకు భరోసా కల్పించవలసిన పోలీసు అధికారులు భయపెట్టడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. పోలీసు అధికారులు చెబుతున్నట్లు కుట్రదారులకు సంబంధించి కచ్చితమైన సమాచారం ఉంటే బాధ్యులను బైండోవర్‌ చేయడమో లేక ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకోవడమో చేయకపోవడానికి కారణం ఏమిటి? గ్రేటర్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగిపోతే మత కల్లోలాలకు సంబంధించి చేసిన ప్రకటనలకు పోలీసు అధికారులు ఏమి సమాధానం చెబుతారు? దేశానికే ఆదర్శం అని చెప్పుకొంటున్న తెలంగాణ పోలీసు వ్యవస్థపై జాలేస్తోంది. అధికార పార్టీ చేతిలో పావులుగా పోలీసులు ఎప్పుడో మారిపోయారు కనుక ఇప్పటి ప్రకటనలపై ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా హిందుత్వవాదాన్ని తెరపైకి తెచ్చిన పార్టీగా బీజేపీని చెప్పుకోవచ్చు. టీఆర్‌ఎస్‌–మజ్లిస్‌ పార్టీల మధ్య నెలకొన్న అవగాహనను ప్రజల్లోకి తీసుకెళ్లి హిందువులను సంఘటితం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌ పీఠాన్ని తాము దక్కించుకుంటే పాతబస్తీలో నివసిస్తున్న రోహింగ్యాలపై సర్జికల్‌ స్ట్రయిక్‌ చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తొలుత తేనెతుట్టెను కదిపారు. మజ్లిస్‌ పార్టీ నుంచి కూడా అంతే ఘాటుగా ప్రతి విమర్శలు వచ్చాయి. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ మరో అడుగు ముందుకేసి హుస్సేన్‌సాగర్‌ను ఆక్రమించి నిర్మించిన ఎన్టీఆర్‌, పీవీ నర్సింహారావు సమాధులను కూల్చరెందుకు అని సవాల్‌ చేశారు. ఈ ప్రకటనతో మిత్రపక్షమైన టీఆర్‌ఎస్‌కు అక్బరుద్దీన్‌ మేలు కంటే కీడే ఎక్కువ చేశారు. మహా నాయకుల సమాధులను కూలుస్తారా? అంటూ ప్రజల్లో కూడా భావోద్వేగాలు ఏర్పడ్డాయి. మజ్లిస్‌ నాయకుల పుణ్యమా అని బీజేపీ గేమ్‌ ప్లాన్‌ సక్సెస్‌ అయింది. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ మొదటిసారిగా ఆత్మరక్షణలో పడింది. తాను హిందూ ధర్మాన్ని ఆచరించడమే కాదు, గౌరవిస్తానని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సొంత పత్రికలో ప్రత్యేక కథనాలను రాయించుకున్నారంటేనే బీజేపీ ఉచ్చులో చిక్కుకున్నారని భావించాల్సి ఉంటుంది. మొత్తంమీద సాధారణ ఎన్నికల కంటే కూడా గ్రేటర్‌ ఎన్నికల్లో రాజకీయాలు వేడెక్కాయి. పోరు మొత్తం టీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య కేంద్రీకృతమై ఉంది. బీజేపీ నాయకులు కోరుకున్నది కూడా ఇదే. బీజేపీ నుంచి ఈ స్థాయిలో సవాల్‌ ఎదురవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఊహించి ఉండరు. ఫలితంగా ఇంతకాలంగా దూరం పెట్టిన వ్యక్తులు, సంస్థలను ఆయన ఆశ్రయిస్తున్నారు. బీజేపీ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించే వామపక్ష భావాలున్న ప్రముఖులు కూడా కేసీఆర్‌పై తమకు ఉన్న వ్యతిరేకతను పక్కనబెట్టి ఆయనకు పరోక్షంగా మద్దతిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుసరించిన నిరంకుశ విధానాల కారణంగా తెలంగాణలో ప్రజాసంఘాలు, వామపక్షశక్తులు ఉనికిని కోల్పోయాయి. ఇంతకాలం కేసీఆర్‌ ఆదరణకు నోచుకోని సీపీఐ, సీపీఎం వంటి వామపక్ష పార్టీలు కూడా కేసీఆర్‌తో తమకున్న విభేదాలను పక్కనపెట్టి పరోక్షంగా మద్దతిస్తున్నాయి. దురదృష్టవశాత్తు వామపక్షాలు బలహీనపడటం వల్ల, వారి పరోక్ష మద్దతు వల్ల కేసీఆర్‌కు కలిగే ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చు. పౌరహక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వంటి వారికి కూడా కేసీఆర్‌ పత్రికలో చోటు లభించిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకోవడానికి బీజేపీ తనదైన శైలిలో వ్యూహరచన చేసుకుంటోంది. బీజేపీకి చెందిన అతిరథ మహారథులంతా హైదరాబాద్‌ చేరుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మినహా మిగతా అగ్రనాయకులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒక నగర పాలక సంస్థ కోసం ఇంతమంది నాయకులు రావాలా అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. అయితే బీజేపీ ఆలోచన వేరు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పీఠాన్ని దక్కించుకున్నా దక్కించుకోకపోయినా బలాన్ని పెంచుకోవడం ద్వారా తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి పూర్తి పట్టు సాధించాలన్నది ఆ పార్టీ వ్యూహంగా చెబుతున్నారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో బీజేపీ ఈ స్థాయిలో బలపడుతుందని కేసీఆర్‌ కూడా అంచనా వేసి ఉండకపోవచ్చు. బీజేపీ నాయకులు కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా తమది హిందువుల పార్టీనే అని చెప్పుకుంటూ మత ప్రాతిపదికన బలపడే ప్రయత్నం చేస్తున్నారు. బల్దియా ఫలితాలు కిందా మీదైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిస్థితి ఏమిటి? అన్న విషయంపై ఇప్పుడు గ్రేటర్‌లోనే కాదు తెలంగాణ అంతటా చర్చ జరుగుతోంది. ఫలితాలను బట్టి బీజేపీలోకి దూకడానికి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నుంచి పలువురు నాయకులు సిద్ధంగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో కూడా అంతఃకలహాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. నిజానికి గ్రేటర్‌ ఎన్నికల్లో పీఠం దక్కించుకోవడం బీజేపీ కంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఎక్కువ అవసరం. గత ఎన్నికల్లో కేవలం 4 డివిజన్లను మాత్రమే గెలుచుకున్న బీజేపీ, ఇప్పుడు అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే తాము బలపడ్డామన్న సంతృప్తి కమలదళానికి దక్కుతుంది. గత ఎన్నికల్లో 99 సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు అంతకంటే తక్కువ సంఖ్యలో గెలిస్తే కేసీఆర్‌ పనైపోయిందన్న భావన ప్రజల్లో ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ తురుపుముక్కగా మతకలహాల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఈ ప్రకటన వర్కవుట్‌ అవుతుందా? బెడిసికొడుతుందా? అన్నది డిసెంబర్‌ నాలుగో తేదీన గానీ తేలదు. ప్రస్తుతం కేసీఆర్‌కు ఏదీ కలిసిరావడం లేదు. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత అయినా పరిస్థితి మారుతుందా? లేదా? అన్నది వేచి చూద్దాం!  


అలవి మాలిన హామీలు!

ఈ విషయం అలా ఉంచితే, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థకా? లేక రాష్ట్ర ప్రభుత్వానికా? అన్న సందేహం కూడా కలుగుతోంది. వివిధ రాజకీయ పార్టీలు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలు, చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఈ అనుమానం కలుగుతోంది. ఆకాశమే హద్దుగా రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఆదాయమెంత? తాము ఇస్తున్న హామీల అమలుకు ఎంత కావాలి? అన్నది ఆలోచించకుండా అది చేస్తాం, ఇది చేస్తాం.. అంతా ఫ్రీ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. 2020–21 లెక్కల ప్రకారం గ్రేటర్‌ మొత్తం బడ్జెట్‌ రూ.6,973 కోట్లు. ఇందులో గ్రేటర్‌ సొంత వనరుల ద్వారా సమకూరేది రూ.5,380 కోట్లు మాత్రమే. మిగతా మొత్తం రోడ్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సమకూరుస్తున్నాయి. ఇంతోటి దానికి ఆల్‌ ఫ్రీ అని ఎలా చెప్పగలుగుతున్నారో తెలియదు. మంచినీళ్లు ఫ్రీ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటిస్తే, వరదల్లో నష్టపోయిన వారికి ప్రస్తుత ప్రభుత్వం 10 వేల వంతున ఇస్తుండగా, తాము 25 వేలు ఇస్తామని బీజేపీ ప్రకటించింది. మీరు 25 వేలు ఇస్తారా, మేం గెలిస్తే 50 వేల వంతున ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన చేసింది. నిజానికి వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 500 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేశారు. బీజేపీ లేదా కాంగ్రెసుకు మేయర్‌ పీఠం దక్కితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్‌ ఒక్క పైసా కూడా ఇవ్వరు. మరి 25 వేలు, 50 వేల హామీల సంగతేంటి? గ్రేటర్‌ అధీనంలో ఉన్న పార్కుల స్థలాలన్నీ అమ్మినా ఈ ఎన్నికల్లో రాజకీయపార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితి. నిజానికి రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలలో ఉచిత మంచినీటి హామీ మినహా మిగతా హామీలేవీ ప్రజల చెవికి ఎక్కడం లేదు. వరద సాయం కింద 25 వేలు, 50 వేలు అన్న వేలంపాటను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలలో ఒకటి రెండు మాత్రమే ప్రజలను ఆకర్షిస్తాయి.


ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు అన్న హామీని మాత్రమే ప్రజలు పట్టించుకున్నారు. నవరత్నాలలో ఏమేమి ఉన్నాయో తెలియకపోయినా కూడా ఆ పదానికి ప్రజలు ఆకర్షితులయ్యారు. తెలంగాణలో కూడా రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చాయి. ప్రజలు అవేవీ పట్టించుకోలేదు. ఎన్నికల హామీలపై ప్రజలకు నిజంగానే నమ్మకం కలిగితే గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచేది. పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏ హామీ ఇవ్వకపోయినా నాలుగు సీట్లు గెలుచుకోలేదా? గ్రేటర్‌ ఎన్నికలలో ఇప్పుడు జరగబోయేది కూడా ఇదే. ప్రత్యర్థి పార్టీ కంటే తాము వెనకబడకూడదన్న ఆలోచనతో మాత్రమే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలు విడుదల చేస్తుంటాయి. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏం జరుగుతున్నదో చూస్తున్నాం కదా! తాము ఇచ్చిన హామీల గురించి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడటం లేదు. ఎన్నికల ప్రచారం మొత్తం టీఆర్‌ఎస్‌,బీజేపీ మధ్య కేంద్రీకృతం కావడంతో మతంతో ముడిపడిన రాజకీయ సవాళ్లకే పరిమితమవుతోంది. అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా మజ్లిస్‌ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు మంట పుట్టిస్తున్నాయి. పాతబస్తీలో కరెంట్‌ బిల్లులు, నీటి బిల్లులు వసూలు చేసే దమ్ము రాష్ట్రప్రభుత్వానికి ఉందా అని మజ్లిస్‌ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సవాల్‌ చేయడం ఏమిటి? పాతబస్తీలో రాష్ట్రప్రభుత్వానికి చోటు లేదనీ, మజ్లిస్‌ పార్టీనే అక్కడ రాజ్యం చేస్తుందని బీజేపీ నాయకులు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ విమర్శలకు బలం చేకూరేలా మజ్లిస్‌ ఎమ్మెల్యే మాట్లాడారు. ఇలాంటి ప్రకటనలు, పరిస్థితుల వల్లనే బీజేపీ బలపడుతోంది. ఎన్టీఆర్‌, పీవీ సమాధులను కూల్చాలంటూ వ్యాఖ్యానించిన మజ్లిస్‌ ముఖ్య నేత అక్బరుద్దీన్‌ ఒవైసీపై; ఆయన వ్యాఖ్యకు స్పందిస్తూ దారుస్సలాంను కూలుస్తామని వ్యాఖ్యానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు తమంతట తాముగా కేసులు నమోదు చేశారు. బీజేపీ నాయకులు దీన్ని కూడా రాజకీయ ప్రచార అస్త్రంగా మార్చుకోవచ్చు. హైదరాబాద్‌లో ప్రశాంతత కావాలా? మత విద్వేషాలు కావాలా? తేల్చుకోండని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పదే పదే గ్రేటర్‌ పౌరులను కోరుతుండగా, వారికి మిత్రపక్షంగా మజ్లిస్‌ నాయకులు మాత్రం సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారు. దీంతో ప్రజల్లో భావోద్వేగాలను మరింతగా రెచ్చగొట్టి తమ వైపునకు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రత్యేక తెలంగాణ పేరిట కేసీఆర్‌ తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రగిల్చినట్లుగానే టీఆర్‌ఎస్‌–మజ్లిస్‌ మధ్య ఉన్న సయోధ్యను ఆసరాగా చేసుకుని హిందువులలో భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం బీజేపీ ఇప్పుడు ప్రయత్నిస్తోంది. ప్రగతిశీల వామపక్ష భావాలున్న వ్యక్తులు, శక్తులు ప్రస్తుత పరిణామాలను చూసి ఖిన్నులవుతున్నారు. అంతకుమించి వారేమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి ఉంది. తెలంగాణలో అనూహ్య రీతిలో బీజేపీ అధికార పార్టీని సవాల్‌ చేసే స్థాయికి ఎదిగిందంటే అందుకు కేసీఆర్‌ పోకడలే కారణం. నిజానికి గ్రేటర్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా, నగర ప్రజల జీవితాల్లో వచ్చే మౌలిక మార్పు ఏమీ ఉండదు. పేద ప్రజల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై ఆశలు రేపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆరేళ్లు దాటినా ఆ కలను నెరవేర్చలేకపోతున్నారు. ఇవ్వాళ పేదలను ఎవరిని కదిలించినా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల గురించే మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో గెలిచే పార్టీకి ఇదే అతి పెద్ద సవాల్‌ కానుంది. నిజానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు, బల్దియాకు సంబంధం లేదు. గ్రేటర్‌ ఆదాయంతో ఇళ్లు నిర్మించి ఇవ్వడం అసాధ్యం. గత ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పేదలకు ఈ హామీని ఇచ్చారు. ఇప్పుడు అదే వారికి శాపంగా మారింది. ఏదో ఒక ఎన్నికల్లో గెలవడం కోసం అలవికాని హామీలు ఇవ్వడం వాంఛనీయమా? కాదా? అన్నది రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి. ఎవరినో మేయర్‌ను చేయడం కోసం అవి ఇంతగా ఆరాటపడాలా? ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం అవసరమా? హైదరాబాద్‌ మహానగరం అందరిదీ. ఈ నగరానికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ, కీడు చేయకుండా ఉంటే అదే పదివేలు!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-11-29T06:17:27+05:30 IST