హరితాహారం పనులను వేగంగా పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2020-08-13T10:25:38+05:30 IST
హరితాహారం పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కె శశాంక అన్నారు. బుధవారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారితో కలిసి జిల్లాలోని అన్ని మండలాల
కలెక్టర్ కె శశాంక
కరీంనగర్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హరితాహారం పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కె శశాంక అన్నారు. బుధవారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారితో కలిసి జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీవోలు, గ్రామసర్పంచులు, కార్యదర్శులతో మానకొండూర్ మండలంలోని హరితహారం పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లెప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, అవెన్యూ ప్లాంటేషన్, మరుగుదొడ్ల నిర్మాణాలు, డంపింగ్ యార్డు నిర్మాణాల పనులు ఈ నెల 31లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హరితహారం పనులను త్వరితగతిన పూర్తి చేయాలనిఅన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ తమ నిధుల నుంచి 10శాతం నిధులు హరితహారానికి కేటాయిచాలని అన్నారు. గ్రామాలకు ఇచ్చిన నిధులను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆదేశించారు.
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం..
తిమ్మాపూర్: రాజీవ్ రహదారి పక్కన చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు కనబడడంతో తిమ్మాపూర్ ఎంపీడీవో రవీందర్రెడ్డి, ఎంపీవో కిరణ్కుమార్పై కలెక్టర్ శశాంక అగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తిమ్మాపూర్, మహాత్మానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్రహదారి ఇరువైపులా నాటుతున్న మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారి పక్కన చెత్తను చూసి ఎంపీడీవో రవీందర్రెడ్డిపై కలెక్టర్ మండిపడ్డారు. ప్రధాన రహదారి ఇలానే ఉంటుందా అని ప్రశ్నించారు. చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు గ్రామ పంచాయితీలకు ప్రభుత్వం ట్రాక్టర్, ట్రాలీ లను అందజేసిందని, పారిశుధ్య కార్మికులను వినియోగించు కోకుండా ఏం చేస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెబితే గాని పనులు చేయారా, మీరు మారరా అని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హారితహారంలో భాగంగా జిల్లా పరిధిలోని రాజీవ్ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎఫ్వో ఆశా, డీఆర్డీవో వెంకటేశ్వర్ రావు, డీపీవో వీర బుచ్చయ్య, ఎంపీడీవో రవీందర్రెడ్డి, ఎంపీవో కిరణ్, కార్యదర్శులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రైతువేదిక భవనాలను పరిశీలించిన కలెక్టర్..
కరీంనగర్ రూరల్: కొత్తపల్లి, కరీంనగర్రూరల్ మండలాల్లో నూతనంగా నిర్మిస్తున్న రైతువేదిక భవనాలను బుధవారం కలెక్టర్ కె శశాంక పరిశీలించారు. మొగ్ధుంపూర్, కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్, బద్దిపల్లి గ్రామాల్లో రైతువేదిక భవనాల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం బద్దిపల్లిలో హరితాహారంలో భాగంగా నాటినమొక్కలను పరిశీలించారు.