వేటకు వేళాయరా..!

ABN , First Publish Date - 2020-05-30T10:47:28+05:30 IST

సముద్రంలో చేపల వేట నిషేధ సమయాన్ని ప్రభుత్వం తగ్గించింది.

వేటకు వేళాయరా..!

జూన్‌ 1 నుంచి సముద్రంలో చేపల వేటకు గ్రీన్‌సిగ్నల్‌

రెండు వారాల ముందుగానే అనుమతించిన ప్రభుత్వం

మత్స్యకారుల్లో ఆనందం


భోగాపురం, మే 29: సముద్రంలో చేపల వేట నిషేధ సమయాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఏటా 61 రోజుల పాటు నిషేధం ఉండగా.. మత్స్యకారుల ఉపాధి దృష్ట్యా 47 రోజులకు కుదించింది. దీంతో జూన్‌ 1 నుంచి సముద్రంలో చేపల వేటకు అనుమతిచ్చింది. ఏటా  చేపల ఉత్పత్తి సమయంగా పరిగణలోకి తీసుకొని ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకూ 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేధించేవారు. ఈ సమయానికి మత్స్యకారులకు నిషేధ భృతిని అందించేవారు. ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. సముద్రంలో మత్స్యకారుల చేపల వేటను సైతం నిలిపివేశారు. ఇటీవల ఆంక్షల సడలింపులో భాగంగా అన్ని రంగాలకు అనుమతిచ్చినా..చేపల వేట నిషేధ సమయం అమల్లో ఉండడంతో మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు.


లాక్‌డౌన్‌ నుంచి సుమారు రెండు నెలలు ఖాళీగా ఉండడంతో ఉపాధికి దూరమయ్యామని.. కుటుంబ జీవనం కష్టంగా మారిందని మత్స్యకారులు విన్నవించడంతో ప్రభుత్వం స్పందించింది. రెండు వారాల ముందుగానే నిషేధాజ్ఞలను సడలించింది. జూన్‌ 1 నుంచి వేటకు అనుమతిచ్చింది. దీంతో చేపల వేటకు మత్స్యకారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మత్స్యకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  

Updated Date - 2020-05-30T10:47:28+05:30 IST