కరోనాతో వరుడి మృతి..95 మంది అతిథులకు కరోనా
ABN , First Publish Date - 2020-06-30T15:21:46+05:30 IST
పెళ్లి అయిన రెండు రోజులకే వరుడు కరోనా వైరస్తో మరణించిన విషాద ఘటన....
పట్నా (బీహార్) : పెళ్లి అయిన రెండు రోజులకే వరుడు కరోనా వైరస్తో మరణించిన విషాద ఘటన బీహార్ రాష్ట్రంలోని పాలిగంజ్ పట్టణ సమీపంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. బీహార్ రాష్ట్రంలోని దీహపాలికి గ్రామానికి చెందిన 30 ఏళ్ల వరుడు గురుగ్రామ్ నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేసేవాడు.యువకుడు పెళ్లి చేసుకునేందుకు మే 12వతేదీన తన స్వగ్రామమైన దీహపాలికి వచ్చాడు. ఈ కాలంలో యువకుడికి కరోనా సోకింది. అయినా అతను పాలిగంజ్ సమీపంలోని ఓ గ్రామంలో జూన్ 15 వతేదీన ఓ యువతిని వివాహమాడారు. వివాహం చేసుకున్న రెండు రోజులకే వరుడి ఆరోగ్య క్షీణించడంతో అతన్ని పట్నాలోని ఎయిమ్స్ కు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. వరుడి బంధువులు కరోనా పరీక్ష చేయించకుండానే అతని మృతదేహాన్ని దహనం చేశారు.
వివాహానికి 50 మంది అతిథులను మాత్రమే అనుమతించాలని, వేడుకలో సామాజిక దూరం పాటించాలనే నియమాలను ఉల్లంఘించారు. పెళ్లికి వచ్చిన అతిథులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 95 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా వధువుకు కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ అని వచ్చింది. ఈ పెళ్లి వల్లనే అత్యధికంగా 95 మందికి కరోనా వ్యాపించిందని తేలడంతో జిల్లా అధికారులు అప్రమత్తమై వారందరినీ క్వారంటైన్ కు తరలించారు.