గుంపులుగా!
ABN , First Publish Date - 2020-03-30T10:26:52+05:30 IST
జిల్లా అంతటా ఆదివారం నిర్లక్ష్యం అలుముకుంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు.. ఆరు రోజుల నుంచి లాక్డౌన్ అమలవుతోంది. ఇళ్ల
మటన్, చేపల మార్కెట్లలో కోలాహలం
కరోనా హెచ్చరికలు పట్టని వైనం
కట్టడి చేయలేకపోయిన యంత్రాంగం
జిల్లా అంతటా ఇదే పరిస్థితి...
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)
జిల్లా అంతటా ఆదివారం నిర్లక్ష్యం అలుముకుంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు.. ఆరు రోజుల నుంచి లాక్డౌన్ అమలవుతోంది. ఇళ్ల నుంచి ప్రజలెవ్వరూ బయటకు రాకుండా, కేవలం నిత్యావసరాల కొనుగోలు కోసమే అధికారులు కొన్ని గంటలపాటు వెసులుబాటు కల్పించారు. ఎక్కడా గుంపులుగా ఉండరాదని హెచ్చరికలు జారీచేస్తూ, 144 సెక్షన్ను సైతం అమలు చేస్తున్నారు. కానీ, ఆదివారం ఈ ఆదేశాలు.. ఆజ్ఞలు పటాపంచలయ్యాయి. మటన్, చేపల మార్కెట్ వద్ద జనం గుంపులుగా గుమిగూడారు. కొందరు సామాజిక దూరం పాటించకుండా, కనీసం మాస్క్లు కూడా ధరించకుండా నిబంధనలు ఉల్లంఘించారు. ఈ నేపథ్యంలో అధికారులు దుకాణాల్లో విక్రయాల వేళలను కుదించారు. సోమవారం నుంచి ఉదయం 11 గంటల వరకే విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు.
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న ‘లాక్డౌన్’.. ఆదివారం కాస్త దారి తప్పింది. 144 సెక్షన్ను ఉల్లంఘిస్తూ, అధికారుల ఆదేశాలను బేఖాతారు చేస్తూ జనం గుంపులుగా మార్కెట్లో దర్శనమిచ్చారు. కనీస జాగ్రత్తలు పట్టించుకోకుండా గంటల తరబడి నిరీక్షించారు. శ్రీకాకుళం నగరంతోపాటు రాజాం, పాతపట్నం, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, టెక్కలి, పాలకొండ తదితర ప్రాంతాల్లో నిత్యావసరాల కోసం ఎగబడ్డారు. ఇందులో అత్యధికంగా మాంసం, చేపల దుకాణాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా గుమిగూడారు.
సామాజిక దూరం పాటించకుండా గంటల తరబడి నిరీక్షించి.. కొనుగోలు చేశారు. కొంతమంది మాస్క్లను కూడా ధరించలేదు. శ్రీకాకుళంలోని పొట్టిశ్రీరాముల మార్కెట్లోని చేపలమార్కెట్ వద్ద భారీగా జనాలు గుమిగూడారు. దీంతో పోలీసులు ఒక్కొక్కరినీ లోపలికి పంపారు. కానీ మార్కెట్నిండా జనం కిక్కిరిసిపోయారు. మాంసం విక్రయ దుకాణాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే నాణ్యమైన చేపలు, మాంసం విక్రయించారా? లేదోనన్న సందేహాలు కొందరిలో తలెత్తుతున్నాయి. ప్రజారోగ్య అధికారులు ఎక్కడా వీటిని తనిఖీ చేసిన దాఖలాలు లేవు. మార్కెట్లలో చేపలు, రొయ్యల నాణ్యతను.. ఎన్నిరోజుల కిందట వాటిని మార్కెట్కు తీసుకువచ్చారు అన్నది నిర్ధారణ చేయలేదు.
ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లడంలేదు. తీర ప్రాంత మండలాల్లో వారం రోజులుగా ఐస్బాక్స్లోనే చేపలు నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, నేటి నుంచి జిల్లా కేంద్రంతో పాటు ఇచ్ఛాపురం, పలాస, రాజాం, పాలకొండ, ఆమదాలవలస, నరసన్నపేట తదితర ప్రాంతాల్లో ఉదయం పదకొండు గంటల వరకే దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఒంటి గంట వరకు దుకాణాలు తెరుచుకోవడంతో మరింత గందరగోళం.. జనాలు కూడా విచ్చలవిడిగా రోడ్లపైనే పలురకాల కారణాలను చూపి తిరుగుతుండడాన్ని గమనించి అధికార యంత్రాంగం ఈ చర్యలను తీసుకుంది. అలాగే శ్రీకాకుళం చేపల మార్కెట్లో రద్దీ పెరగడం... వినియోగదారుల మధ్య తోపులాట జరగడం వల్ల చేపల మార్కెట్ను ఎనభై అడుగుల రోడ్డుకి సోమవారం నుంచి తరలిస్తున్నారు.
కొనసాగుతున్న లాక్డౌన్...
జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో ఆదివారం ఇచ్ఛాపురం నుంచి రణస్థలం మండలం పైడిభీమవరం వరకు జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర రహదారులపై ప్రజలు రాకపోకలు సాగించారు. ఇక నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం పోలీసులు, పీఈటీలు రోడ్లపైనే ఉన్నారు. వాహనదారులను, ప్రజలను రోడ్లపైకి వచ్చినవారిని నివారించి.. వెనక్కి పంపారు. అలాగే మాస్క్లు లేకుండా.. సరైన కారణం చూపకుండా రోడ్లపైకి వచ్చినవారికి పోలీసులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు.