జవాద్‌ తుఫాన్‌తో రైతుల్లో గుబులు

ABN , First Publish Date - 2021-12-04T06:01:21+05:30 IST

జవాద్‌ తుఫాన్‌ నేపథ్యంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు అప్రమత్తమయ్యారు.

జవాద్‌ తుఫాన్‌తో రైతుల్లో గుబులు
వరి పనలను కల్లాలకు మోసుకువెళుతున్న రైతులు


వరిని కాపాడుకునే పనుల్లో బిజీబిజీ 

పాడేరు, డిసెంబరు 3: జవాద్‌ తుఫాన్‌ నేపథ్యంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు అప్రమత్తమయ్యారు. తమ పంటను కాపాడుకునేందుకు కుస్తీలు పడుతున్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే ఈ ఏడాది వరుణుడు కరుణించడంతో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. దీంతో ఖరీఫ్‌ వరి పంట ఆశాజనకంగా ఉంది. అలాగే దిగుబడులు సైతం బాగున్నాయి. దీంతో రైతులు ప్రస్తుతం కోతల్లో బిజీబిజీగా ఉన్నారు. కోసేసి పొలంలోనే ఉన్న పనలను కట్టకు కట్టి ఇళ్లకు మోసుకుంటున్నారు. కోసిన పనలు పొలంలో ఉండిపోతే తడిచిపోయి నాశనం అవుతుంది. దీంతో ప్రస్తుతం రైతులంతా పొలాల్లోని పంటను ఇంటికి చేర్చే పనుల్లో ఉన్నారు. అయిప్పటికీ ఇంకా చాలా వరకు పంట కోయని పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల వరి కంకులు నేలకొరిగి ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఇంకా పొలాల్లోనే వరి పనలున్నాయి. అలాగే మొత్తం పంటను ఇప్పుడే కోసేసి అంతా నిల్వ చేసుకోలేని దుస్థితి. దీంతో అన్నదాతలు గుబులు చెందుతున్నారు. అవకాశం ఉన్న మేరకు కోసేసి ఇంటికి చేర్చుతున్నారు. 

 

Updated Date - 2021-12-04T06:01:21+05:30 IST