చిరుజల్లుల రైతుల గుండెల్లో గుబులు

ABN , First Publish Date - 2021-11-22T06:22:21+05:30 IST

ఆరుగాలం శ్రమించి సాగుచేసిన ధాన్యం విక్రయానికి అన్నదాతలు అష్టకష్టాలుపడుతున్నారు. వాతావరణంలో మా ర్పుల కారణంగా వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. ఆకాశంలో మబ్బులు తప్ప సూర్యుడి జాడ ఉండటం లేదు.

చిరుజల్లుల రైతుల గుండెల్లో గుబులు
వలిగొండ మండలం పొద్దుటూరు కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం

 కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోనే ధాన్యం

 సరిపడా టార్పాలిన్లు లేక తడుస్తున్న రాశులు

 పలుచోట్ల ధాన్యానికి మొలకలు

 మందకొడిగా సాగుతున్న కొనుగోళ్లు

 ఇప్పటివరకు 14,315మెట్రిక్‌ టన్నుల సేకరణ

ఆరుగాలం శ్రమించి సాగుచేసిన ధాన్యం విక్రయానికి అన్నదాతలు అష్టకష్టాలుపడుతున్నారు. వాతావరణంలో మా ర్పుల కారణంగా వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. ఆకాశంలో మబ్బులు తప్ప సూర్యుడి జాడ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వరికోతలు పూర్తయ్యా క ధాన్యా న్ని ఆరబెట్టేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు టార్పాలిన్లు లేకపోవడంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు.

- (ఆంరఽధజ్యోతి,యాదాద్రి)

అడపాదడపా కురుస్తున్న చిరుజల్లులతో ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. ఇప్పటికే కోతలు పూర్తిచేసిన రైతులు ధాన్యాన్ని ఐకేపీ, పీఏపీఎస్‌ కేంద్రాల్లో ఆరబోశాయి. అయితే వారం రోజులుగా సరిగా ఎండలేకపోవడంతో తేమశాతం తగ్గడం లేదు. అంతేగాక కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు లేవు. దీంతో భారీ వర్షం వస్తే ధాన్యం కొట్టుకుపోతోంది. ఇప్పటికే కొన్ని కొనుగోలు కేంద్రాల్లో చిరుజల్లు కారణంగా ధాన్యం తడిచి మొలకలు కూడా వచ్చాయి. రైతులు ట్రాక్టర్లకు ఫ్యాన్లు ఏర్పాటు చేసి తడిచిన వరిని ఆరబెడుతున్నారు.


ముందుకుసాగని కొనుగోళ్లు

జిల్లాలో వానాకాలం సీజన్‌లో మొత్తం 4.50లక్షల ఎకరాల్లో పలు పంటలు సాగయ్యాయి. వరి 2.60లక్షల ఎకరాల్లో సాగవ్వగా, 2లక్షల కు పైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అధికారు లు అంచనా వేశారు. వలిగొండ, భూదాన్‌పోచంపల్లి, భువనగిరి, బీబీనగర్‌, చౌటుప్పల్‌ మండలాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధిక శాతం వరి సాగైంది. ఈ ప్రాంతాల్లో వరి కోతలు 40 రోజుల క్రితమే పూర్తయ్యాయి. కోతలు పూర్తిచేసిన ధాన్యాన్ని రైతులు కల్లా లు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోశారు. ప్రభుత్వం కొనుగోళ్లపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో యంత్రాంగం ఆలస్యంగా కొనుగో లు కేంద్రాలు ప్రారంభించింది. దీంతో ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయింది. ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కాగా, వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు మళ్లీ కొనుగోళ్లు మందగించాయి. వాతావరణంలో మార్పు కారణంగా ధాన్యంలో తేమశాతం పెరగడంలేదు. జిల్లాలో మొత్తం 279 ధాన్యం కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వీటిలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 184, ఐకేపీ 91, మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో నాలుగు కేంద్రాలు కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటివరకు జిల్లాలో 2124 మంది రైతుల నుంచి 14,315మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. వర్షాలు లేకుంటే నాలుగైదు రోజుల్లో 50వేల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోళ్లు పూర్తయ్యేవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాలన్నీ గ్రా మాల శివారులో మైదాన ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. చిరుజల్లులకే వరద వచ్చి ధాన్యం కొట్టుకుపోతోంది. ఇక భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కొనసాగుతున్న నిరసనలు

వానాకాలంలో సాగుచేసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, కొనుగోలు కేంద్రాల్లో జాప్యంపై రైతులు, పలు పార్టీలు నిత్యం నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి తెలపాల ని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళనలు చేస్తోంది. మరోవైపు వానాకాలంలో రైతులు సాగుచేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగో లు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు నిత్యం నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నాయి. కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద రైతులతో సోమవారం ఉదయం 11గంటలకు ధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ నేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే బీబీనగర్‌ మండల కేంద్రంలో జాతీయరహదారిపై నాయకులు బైఠాయించి, వరి కుప్పలను రోడ్లుపై పోసి రాస్తారోకో నిర్వహించారు. ధాన్యానికి నిప్పుపెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు. ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టని పక్షంలో రైతులు, పార్టీలు ఆందోళనలు ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.


జిల్లాలో 5.6మి.మీ సగటు వర్షపాతం

జిల్లావ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉద యం నుంచి సాయంత్రం వరకు  5.6మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బీబీనగర్‌ మండలంలో 21.4మి.మీ వర్షపాతం నమోదైంది. తుర్కపల్లి మండలంలో 3.3మి.మీ, రాజపేట లో 10.7మి.మీ, ఆలేరులో 3.0మి.మీ, మోటకొండూరులో 4మి.మీ, యాదగిరిగుట్టలో 2.5మి.మీ, భువనగిరిలో 7.3మి.మీ, బొమ్మలరామారంలో 5.6మి.మీ, బీబీనగర్‌లో 21.4మి.మీ, పోచంపల్లిలో 3.3మి.మీ వర్షం కురిసింది. చౌటుప్పల్‌లో 5.4మి.మీ, నారాయణపూర్‌లో 3.5మి.మీ, రామన్నపేటలో 11.2మి.మీ, వలిగొండలో 9.5మి.మీ, ఆత్మకూరులో 1.8మి.మీ, మోత్కురులో 2.8మి.మీ, గుండాలలో 2మి.మీ వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆకాశం మబ్బులుపట్టి ముసురు కురుస్తోంది.

Updated Date - 2021-11-22T06:22:21+05:30 IST