తౌక్తే తుపాను.. లక్షన్నర మందిని తరలించిన గుజరాత్

ABN , First Publish Date - 2021-05-18T01:12:20+05:30 IST

శరవేగంగా దూసుకొస్తున్న తౌక్తే తుపాను గుజరాత్‌ను భయపెడుతోంది. రాష్ట్రంపై తుపాను తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో

తౌక్తే తుపాను.. లక్షన్నర మందిని తరలించిన గుజరాత్

అహ్మదాబాద్: శరవేగంగా దూసుకొస్తున్న తౌక్తే తుపాను గుజరాత్‌ను భయపెడుతోంది. రాష్ట్రంపై తుపాను తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం సోమవారం లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నౌకాశ్రయాలతోపాటు ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేసింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అత్యంత తీవ్రతతో సంభవిస్తున్న తుపాను ఇదే. ఈ తుపాను ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించింది. నేటి రాత్రికి ఇది గుజరాత్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. 


దాదాపు 20 ఏళ్ల తర్వాత గుజరాత్‌ను తాకనున్న అత్యంత తీవ్రమైన తుపాను ఇదే కావొచ్చని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి పంకజ్ కుమార్ తెలిపారు. 1998లో దాదాపు ఇదే తీవ్రతతో తుపాను కాండ్లాను తాకింది. ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలో వస్తున్న తుపాను ఇదేనని పంకప్ పేర్కొన్నారు. 1998లో సంభవించిన తుపానులో దాదాపు 4 వేల మంది మరణించారు. వేలాదిమంది క్షతగాత్రులయ్యారు. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇప్పటికే కరోనా బారినపడి విలవిల్లాడుతున్న భారత్‌కు తుపాను మరో దెబ్బ అని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ దక్షిణాసియా డెలిగేషన్ హెడ్ ఉదయ రేజ్మి అన్నారు.  

Updated Date - 2021-05-18T01:12:20+05:30 IST