గుమ్మిడిగొండ కాటా దాటని చెరకు!
ABN , First Publish Date - 2021-01-17T06:13:10+05:30 IST
మండలంలోని గుమ్మిడిగొండ కాటా వద్ద రోజుల తరబడి చెరకు నిలిచిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
12వ తేదీ నుంచి నిలిచిన బండ్లు
ఎండకు ఎండి పోతుందని రైతులు ఆందోళన
నాతవరం, జనవరి 16 : మండలంలోని గుమ్మిడిగొండ కాటా వద్ద రోజుల తరబడి చెరకు నిలిచిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడికి రైతులు తోలిన చెరకును పాయకరావుపేట తాండవ షుగర్ ఫ్యాక్టరీకి తరలించి క్రషింగ్ చేస్తుంటారు. పొలంలో కోసిన పంటను ఈ నెల 12వ తేదీన కాటా వద్దకు తీసుకు రాగా, ఇంత వరకు ఫ్యాక్టరీకి తరలించలేదని రైతులు తెలిపారు. ఇక్కడ సుమారు 30 వరకు బండ్లు నిలిచిపోయాయని వాపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే క్రషింగ్లో అంతరాయం తలెత్తడం వల్ల ఇలా జరిగిందని చెపుతున్నారని అంటున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించకుంటే చెరకు మరింత ఎండిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.