చెరువులోపడి సైనికుడి మృతి
ABN , First Publish Date - 2020-10-25T11:37:08+05:30 IST
చింతలపేట పంచాయతీ దండెంవలస గ్రామానికి చెందిన సైనికుడు గుండ లక్ష్మణరావు(37) చెరువులో పడి మృతిచెందాడు.
ఆమదాలవలస: చింతలపేట పంచాయతీ దండెంవలస గ్రామానికి చెందిన సైనికుడు గుండ లక్ష్మణరావు(37) చెరువులో పడి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు... లక్ష్మణరావుకు ఇటీవల అలహాబాద్కు బదిలీ కావడంతో సెలవుపై గత నెల 23న ఇంటికి వచ్చాడు. మరో రెండురోజుల్లో తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం గ్రామ సమీపంలోని పెద్ద చెరువుకు కుమారుడు యశ్వంత్తో కలిసి స్నానానికి వెళ్లాడు. కుమారుడిని గట్టుపై కూర్చొబెట్టి చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోవడంతో తలకు గాయమై నీటిలో మునిగిపోయాడు. దీన్ని చూసిన యశ్వంత్ ఏడ్చుకొంటూ ఇంటికి వెళ్లి చెప్పాడు. దీంతో గ్రామస్థులు చేరుకొని చెరువులో వెతగ్గా లక్ష్మణరావు మృతదేహం లభ్యమైంది. ఈ సమాచారాన్ని సైనికాధికారులకు అందించారు. లక్ష్మణరావు 17ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నాడు. భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు.