నరకప్రాయం

ABN , First Publish Date - 2021-12-01T04:53:45+05:30 IST

రెండు జిల్లాలను కలిపే పోలెపల్లి గ్రామం రోడ్డు నరకప్రాయంగా మారింది.

నరకప్రాయం
బీటీ కొట్టుకుపోయి అధ్వానంగా మారిన పోలెపల్లి- మంగళికుంట తండా రోడ్డు

  • గుంతలమయంగా పోలెపల్లి గ్రామ బీటీ రోడ్డు 
  • కంకర తేలి, గోతులేర్పడి తరచూ ప్రమాదాలు 

ఆమనగల్లు : రెండు జిల్లాలను కలిపే పోలెపల్లి గ్రామం రోడ్డు నరకప్రాయంగా మారింది. బీటీ కొట్టుకుపోయి అడుగడుగునా గోతులేర్పడ్డాయి. ఆమనగల్లు మండలం పోలెపల్లి మీదుగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలానికి వెళ్లే ఈ రోడ్డు పూర్తిగా పాడై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతు న్నాయి. రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన 3 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్వహణ లేక కళాహీనంగా మారింది. చాలాచోట్ల బీటీ లేచి, కంకర కొట్టుకుపోయి గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మరింత దెబ్బతింది. దీంతో తరుచూ చిన్నచిన్న ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రోడ్డు మీదుగా ఆమనగల్లు, వెల్దండ మండలాలకు చెందిన అనేక గ్రామాల ప్రజలు, ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వెల్దండ మండలంలోని అంకమోని కుంట, సల్లపల్లి, బొల్లంపల్లి, గ్రామస్థులకు ఈ రోడ్డు ఎంతో సౌకర్యంగా ఉండేది. మాడ్గుల, ఆమనగల్లు మండలాలకు చెందిన అనేక గ్రామాల ప్రజలు ఈ రోడ్డు మీదుగానే కల్వకుర్తి పట్టణానికి వెళ్తుంటారు. పాడైన రోడ్డుతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. రోడ్డు నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, యం త్రాలతో కాకుండా కూలీల ద్వారా పనులు చేపట్టడం, నిర్వహణ లోపంతో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. రోడ్డు మరమ్మతు గురించి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ హామీ ఇచ్చినా నేటికీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పం దించి పాడైన రోడ్డును మరమ్మతు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలి

పోలెపల్లి గేటు నుంచి అంకమోని కుంటకు వెళ్లే బీటీ రోడ్డు మరమ్మతు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు పూర్తిగా పాడై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. రోడ్డుపై గోతులేర్పడి తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు జిల్లాలను కలిపే బీటీ రోడ్డు ఆధునికీకరించి డబుల్‌ రోడ్డుగా విస్తరించాలి. ఈ విష యంలో ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలి.

- వగ్గు ప్రభాకర్‌, పోలెపల్లి 


ప్రతి పాదనలు పంపాం...

పోలెపల్లి - మంగళి కుంట తండా బీటీ రోడ్డు మరమ్మతు, ఆధునికీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ద్వారా సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేశాం. తాత్కాలిక మరమ్మతు చేసి ఇబ్బందులు తీర్చాలని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులకు సూచించాం. రోడ్డు పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న మాట వాస్తవమే. 

- దోనాదుల కుమార్‌, ఎంపీటీసీ, పోలెపల్లి 



Updated Date - 2021-12-01T04:53:45+05:30 IST