గుంటూరు.. కరోనా కాటుకు ముగ్గురు బలి

ABN , First Publish Date - 2020-07-09T14:53:57+05:30 IST

జిల్లాలో బుధవారం కరోనా కాటుకు ముగ్గురు బలయ్యారు..

గుంటూరు.. కరోనా కాటుకు ముగ్గురు బలి

తెనాలి(గుంటూరు): జిల్లాలో బుధవారం కరోనా కాటుకు ముగ్గురు బలయ్యారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల్లో ఓ వైద్యుడు, బెల్లంకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మాచర్ల 4వ వార్డుకు చెందిన ఓ వృద్ధురాలు కరోనాతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెనాలి వైద్యుడు ఐదురోజుల క్రితం పాజిటివ్‌ రావడంతో జీజీహెచ్‌కు తరలించారు.


అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కళాశాలకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సనత్‌కుమారి తెలిపారు. బెల్లంకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ కరోనాతో మృతి చెందినట్లు ఎంపీడీవో గబ్రూనాయక్‌ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ను సోమవారం నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారన్నారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందన్నారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. ఆయన భార్యకు కూడా పాజిటివ్‌ అని తెలిపారు. కార్యాలయ ఉద్యోగి మృతితో మండలంలో కలకలం రేగింది. బుధవారం కార్యాలయానికి తాళాలు వేశారు.


అనంతరం కార్యాలయ ఆవరణం చుట్టూ శానిటైజ్‌ చేశారు. మాచర్ల 4వ వార్డుకు చెందిన విశ్రాంత ప్రభుత్వోగికి వారం క్రితం పాజిటివ్‌ వచ్చింది. ఆయన వద్దే ఉండే సోదరికి కూడా పాజిటివ్‌ రావడంతో మంగళగిరి ఎన్నారైకు తరలించారు. ఈ క్రమంలో వృద్ధురాలికి అస్వస్తతగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మృతి చెందింది. ఈమెతో ఇప్పటికి పట్టణంలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. 


Updated Date - 2020-07-09T14:53:57+05:30 IST