ఆసిఫాబాద్‌ జిల్లాలో గుప్పుమంటున్న గుడుంబా

ABN , First Publish Date - 2022-01-21T04:17:53+05:30 IST

జిల్లాలో గుడుంబా గుప్పుమంటోంది. ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోకజవర్గాల్లో ఈ దందాను కొంతమంది యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుడంబా రహిత సమాజం కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సఫలీకృతమవడం లేదు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో గుప్పుమంటున్న గుడుంబా

- దాడులు చేస్తున్నా ఆగని దందా

- బలవుతున్న నిరుపేదలు

కాగజ్‌నగర్‌, జనవరి 20: జిల్లాలో గుడుంబా గుప్పుమంటోంది. ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోకజవర్గాల్లో ఈ దందాను కొంతమంది యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుడంబా రహిత సమాజం కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సఫలీకృతమవడం లేదు. ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు తరుచూ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ ఈ దందాకు బ్రేక్‌ పడడం లేదన్న ఆరోపణలున్నాయి. 

గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా

సిర్పూరు నియోజకవర్గంలోని కౌటాల, బెజ్జూరు, పెంచికల్‌పేట, దహెగాం, కాగజ్‌నగర్‌ మండలాల్లోని పలుప్రాంతాల్లో ఈ దందాను జోరుగా సాగుతోంది. పాత విధానానికి స్వస్తి పలికి ఇప్పుడు కొత్త తరహాలో గుడంబాను తయారీ చేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్లు, వివిధ పరికరాలను ఉపయోగించి గుడుంబాను తయారు చేస్తున్నారు. ప్రధానంగా నదీ పరివాహక ప్రాంతాలు, ఎవరికీ అంతుచిక్కకుండా ఉండే పొలాల్లో తయారు చేస్తున్నారు. తయారు చేసిన గుడుంబాను ప్యాక్‌ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తుండడంతో పేద కూలీలు ఎక్కువగా తాగుతున్నారు. ఎక్సైజ్‌ అధికారులు  తరుచూ సమగ్ర స్థాయిలో నివేదికలు రూపొందించి దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ దందా ఆగడం లేదు. తాజాగా పోలీసులు సైతం గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి నిర్వాహకులపై కేసులు కూడా నమోదు చేశారు. సిర్పూరు నియోజకవర్గంలోని పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు సంయు క్తగా దాడులు నిర్వహించి 15కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేయడమే కాకుండా గుడుంబా అమ్మకాలపై, వాడకంపై గ్రామస్థులను చైతన్య పరుస్తున్నారు. 

గతేడాది నుంచి ఎక్సైజ్‌ అధికారులు పూర్తి స్థాయిలో గుడుంబా తయారు చేసే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ గ్రామాల్లోనే తయారీదారులకు గుడుంబా తయారు చేస్తే జరిగే పరిణామాలపై అవగాహణ కల్పిస్తున్నారు. గుడుంబాకు బదులుగా చిరువ్యాపారం చేసేందుకు రుణాలను ఇప్పిస్తున్నారు. గుడుంబా రహిత సమాజం కోసం అంతా అడుగులు వేస్తున్నారు. ఐతే కొంత మంది మళ్లీ ఇదే దందాను ఎంచుకొని నడిపిస్తున్నారు. గుడుంబా తయారీ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రధానంగా కిందటేడు లాక్‌డౌన్‌ ఉండడంతో మద్యం లభించక పోవడంతో గుడుంబా తాగారు. దీంతో ఎక్కడ లేని డిమాండు వచ్చిపడింది. దీన్ని కంట్రోల్‌ చేసేందుకు ఎక్సైజ్‌, పోలీసు శాఖలు సమన్వయంగా రంగంలోకి దిగి అక్రమ రవాణాపై నిఘా పెట్టాయి. కౌటాల నుంచి కాగజ్‌నగర్‌కు ఆటోలు, బైక్‌లతో తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. అలాగే కాగజ్‌నగర్‌ ఎక్సైజ్‌ సీఐ రాథోడ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి సిర్పూరు నియోజకవర్గంలో గుడుంబా తయారీ చేసి వారిపై గట్టి నిఘా పెడుతున్నారు. గుడుంబా తయారీలో ప్రధానంగా ఉపయోగించే బెల్లం, స్పటిక అమ్మకాలపై పోలీసులు, ఎక్సైజ్‌  అధికారులు నిఘా పెట్టారు. 

గుడుంబా అమ్మకాలపై గట్టి నిఘా 

-మహేందర్‌ సింగ్‌, ఎక్సైజ్‌ సీఐ 

గుడుంబా అమ్మకాలు, స్థావరాలపై గట్టి నిఘా పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అమ్మకాలు జరపరాదని జనమైత్రీ సదస్సులో గ్రామస్థులకు వివరించాం. గుడంబా వల్ల కలిగే అనర్థాలపై కూడా ర్యాలీలు నిర్వహించాం. ఎవరిని కూడా ఊపేక్షించేది లేదని స్పష్టంగా చెప్పుతున్నాం. గ్రామగ్రామాన అవగాహన పరుస్తున్నాం. ప్రత్యేక టీంల ద్వారా గుడుంబా తయారు చేసే గ్రామాలపై గట్టి నిఘా పెట్టాం.

Updated Date - 2022-01-21T04:17:53+05:30 IST