జోరుగా గుట్కా విక్రయాలు
ABN , First Publish Date - 2021-06-15T07:20:15+05:30 IST
దర్శి ప్రాంతంలో నిషిద్ధ గుట్కా, ఖైనీ, పాన్పరాగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. స్థానిక నగర పంచాయతీతో పాటు అనేక గ్రామాల్లో దుకాణాల్లో, బడ్డీబంకుల్లో వాటిని ముమ్మరంగా విక్రయిస్తున్నారు.
దర్శి, జూన్ 14 : దర్శి ప్రాంతంలో నిషిద్ధ గుట్కా, ఖైనీ, పాన్పరాగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. స్థానిక నగర పంచాయతీతో పాటు అనేక గ్రామాల్లో దుకాణాల్లో, బడ్డీబంకుల్లో వాటిని ముమ్మరంగా విక్రయిస్తున్నారు. లాక్డౌన్ ఆసరాగా చేసుకొని అక్రమ వ్యాపారులు మరింతగా రెచ్చిపోతున్నారు. పోలీసుల దాడుల్లో అనేక చోట్ల గుట్కా ప్యాకెట్లు దొరికినా అక్రమార్కులు ఏమాత్రం వెరవడం లేదు.కాయి. కొద్దిరోజుల క్రితం సీఐ భీమానాయక్ ఆధ్వర్యంలో పోలీసులు దర్శిలో విక్రయిస్తున్న మూడుచోట్ల గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పట్టుకున్నారు. గతంలో వినుకొండ, అద్దంకి ప్రాంతాల నుంచి సరుకు ఇక్కడకు దిగుమతి అయ్యేది. పోలీసులు ఈ ప్రాంతంలో దాడులు నిర్వహిస్తుండటంతో అక్రమార్కులు రూటు మార్చారు. బేస్తవారిపేట, గిద్దలూరు ప్రాంతాల నుంచి తాజాగా సరుకు దిగుమతి చేస్తున్నట్లు సమాచారం. అక్రమ వ్యాపారులు గుట్కా వ్యాపారంతో భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అసలు ధరకు నాలుగు రెట్లు అధికంగా విక్రయిస్తున్నారు. వీటికి అలవాటు పడిన వ్యక్తులు అధిక ధరలకైనా కొనుగోలు చేసి తీసుకుంటున్నారు. నిషిద్ధ గుట్కా ప్యాకెట్ల వ్యాపారాన్ని అరికట్టాల్సిన ఫుడ్ సేఫ్టి అధికారులు అసలు పట్టించుకోవటం లేదు. ఇటీవల పోలీసులు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించటంతో అక్రమ వ్యాపారం బట్టబయలైంది. అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రూ.37 వేల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత
ఉలవపాడు, జూన్ 14 : మండలంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను అమ్ముతున్నట్లు అనుమానాలు ఉన్న పలు షాపులపై స్థానిక పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.37,000 విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నట్లు ఎస్సై పీ విశ్వనాఽథరెడ్డి చెప్పారు. చాకిచర్ల గ్రామానికి చెందిన మిరియం శ్రీనివాసులు, పెదపట్టపుపాలేనికి చెందిన తోపిరి రమేష్, ఉలవపాడు గ్రామానికి చెందిన అచ్యుత కొండలరావు, పాలూరి సుబ్బారావులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.